న్యూఢిల్లీ : పార్లమెంట్లో ఏ పదాన్ని ఉపయోగించకుండా నిషేధమేది విధించలేదని.. సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పవచ్చని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ‘సిగ్గుచేటు, ‘జుమ్లాజీవి’, ‘దుర్వినియోగం’, ‘ద్రోహం’, ‘అవినీతి’, ‘నాటకం’, కొవిడ్ స్ప్రెడర్, స్నూప్గేట్ తదితర పదాలు అన్పార్లమెంటరీగా పేర్కొంటూ లోక్సభ సెక్రటేరియట్ బుక్ను విడుదల చేయగా.. వివాదాస్పదమైంది.
ఈ క్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ పార్లమెంటరీ పద్ధతులపై అవగాహన లేని వ్యక్తులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని, చట్టసభలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా పని చేస్తాయన్నారు. ‘సభ్యులకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది. ఆ హక్కును ఎవరూ లాక్కోలేరు. కానీ, అది పార్లమెంట్ పద్ధతి ప్రకారం ఉండాలి’ అన్నారు. చట్టసభలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉన్నాయన్న ఆయన.. 1959 నుంచి ఈ సాధారణ అభ్యాసం కొనసాగుతుందన్నారు. తొలగింపు కోసం ఎంచుకున్న పదాలను అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష సభ్యులు కూడా ఉపయోగించారని బిర్లా పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. లోక్సభ సెక్రటేరియట్ విడుదల చేసిన బుక్లెట్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్తో పాటు పలువురు విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనను సరైన రీతిలో ఎండగడుతూ చేసే వ్యాఖ్యలు ఇప్పుడు అన్పార్లమెంటరీ పదాలుగా మారాయంటూ రాహుల్ విమర్శించారు. తాను ఆ పదాలను వాడుతానని, దమ్ముంటే స్పీకర్ తనను సస్పెండ్ చేయాలని టీఎంపీ ఎంపీ సవాల్ విసిరారు.