న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ మాజీ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బంధ్యోపాధ్యాయ్కు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లోని 51వ సెక్షన్ ప్రకారం ఆ నోటీసులు ఇచ్చింది. మూడు రోజుల్లోగా ఆ నోటీసులకు లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొన్నది. యాస్ తుఫాన్పై జరిగిన ప్రధాని సమీక్ష సమావేశానికి బెంగాల్ సీఎస్ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రధానితో జరిగిన సమీక్ష సమావేశానికి సీఎం బంధ్యోపాధ్యాయ్ గైర్హాజరు కావడంతో.. ఆయన్ను కేంద్ర సర్వీసుల కోసం రిలీవ్ చేయాలని కేంద్రం కోరింది. కానీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. బంధ్యోపాధ్యాయ్ను సలహాదారుగా నియమించుకున్నారు. సోమవారమే మాజీ సీఎస్ రిటైర్ అయినట్లు ఆమె ప్రకటించారు. దీంతో కేంద్రం, మమతా మధ్య వైరం కొనసాగుతూనే ఉన్నది.