హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని రూపొందించారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ పథకం బృహత్తరమైనదే కాకుండా, విప్లవాత్మకమైనదిగా అభివర్ణించారు. పథకం అమలుకు నిధుల కొరత ఏ మాత్రం లేదని సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
తెలంగాణలో తప్ప దళితబంధు పథకం మరెకడా లేదని తెలిపారు. పథకం అమలు విషయంలో ఎవరూ అయోమయానికి, గందరగోళానికి గురికావొద్దని సూచించారు. దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ యజ్ఞం మాదిరిగా దృఢ సంకల్పంతో అమలుచేస్తున్నారని వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 యూనిట్లకు సంబంధించి మొత్తం 11,800 పూర్తికాగా, మిగిలిన 335 యూనిట్ల గ్రౌండింగ్ నాలుగైదు రోజుల్లో పూర్తవుతుందని కొప్పుల పేర్కొన్నారు. నియోజకవర్గానికి 1500 యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని తెలిపారు. వచ్చే ఎనిమిదేండ్లలో మొత్తం 17 లక్షల ఎస్సీ కుటుంబాలకు ఈ పథకం అందుతుందని వెల్లడించారు.