మంత్రి జోక్యంతో తాజా జీవో
ఉపాధ్యాయ సంఘాల హర్షం
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఏటా తమ ఆస్తులను వెల్లడించాలంటూ ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఉపాధ్యాయులు తమ ఆస్తులను వెల్లడించడంతో పాటు చర, స్థిర ఆస్తుల క్రయ, విక్రయాలకు ముందుగా అనుమతి తీసుకోవాలని సూచిస్తూ ఇటీవల పాఠశాల విద్యాశాఖ డైరెకర్ట్ ఆర్సీ నంబర్ 192-ఎస్టాబ్లిష్మెంట్-1/2022 పేరిట ఉత్తర్వులు జారీ చేశారు.
నిజానికి ఆస్తుల వెల్లడి అంశం సర్వీసు నిబంధనల్లోనే ఉంటుంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులు సైతం ఏటా తమ ఆస్తులను విధిగా వెల్లడిస్తారు. వీటిని గుర్తు చేస్తూ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై అపోహలు తలెత్తడంతో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి జోక్యం చేసుకొన్నారు. వాటిని నిలిపివేస్తున్నట్టు శనివారం రాత్రి ప్రకటించారు. దీంతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. అపోహలను తొలగిస్తూ, తాజాగా జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్టు పలు ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. తాజా ఉత్తర్వులపై పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం చెన్నయ్య, అంజిరెడ్డి, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై అశోక్కుమార్, ముత్యాల రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. తమది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని కేసీఆర్ ప్రభుత్వం మరోమారు నిరూపించుకొన్నదని ఎం చెన్నయ్య, అంజిరెడ్డి అభిప్రాయపడ్డారు.