యాసంగి: వరి విత్తనాల అమ్మకాలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం ఏవిధమైన నిషేధాన్ని విధించలేదని హైకోర్టుకు ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. యాసంగిలో వరి సాగు చేయవద్దనే నిర్ణయం ఏమీ తీసుకోలేదని తెలియజేశారు. ఆ దిశగా చర్యలు కూడా ఏమీ తీసుకోలేదని, భవిష్యత్లో కూడా వరి సాగుపై నిషేధం లేదా వరి విత్తనాల అమ్మకాలపై ఆంక్షలు లేదా నిషేధం విధించే యోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
వరి సాగుపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై సిద్దిపేట మండలం ఇమాంబాద్కు చెందిన రైతు బాతుల నారాయణ తదితరులు దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. వినోద్కుమార్ మంగళవారం నాడు విచారణ చేపట్టారు. వరి విత్తనాలు అమ్మరాదని, దీని విషయంలో కోర్టులు ఉత్తర్వులు ఇచ్చినా కూడా వరి విత్తనాలను విక్రయించరాదని జిల్లా కలెక్టర్ వ్యాఖ్యలు చేసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు.
వాదనలు విన్న హైకోర్టు ఇలాంటి చర్యలు వద్దని కలెక్టర్కు మౌఖికంగా చెప్పింది. నిషేధిత జాబితాలో వరి లేనప్పుడు కలెక్టర్ వ్యాఖ్యలు సరికాదంది. కోర్టు ఉత్తర్వులు ఉన్నా వరి విత్తనాలు అమ్మే షాపుల్ని తెరవనీయబోమని చెప్పడం న్యాయప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందని అభిప్రాయపడింది.
ఈ క్రమంలో తిరిగి కల్పించుకున్న ఏజీ.. వరి సాగు/వరి విత్తనాలపై నిషేధాన్ని విధించలేదని, ఈ విషయంలో కలెక్టర్కు తన వాదన చెప్పుకునే ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. వరి విత్తనాల అమ్మకాలు, కొనుగోలుపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని కలెక్టర్ను ఆదేశించింది. కలెక్టర్ వ్యాఖ్యలు కోర్టుధిక్కారం కిందకు వస్తుందో లేదో పరిశీలన నిమిత్తం ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.