బొగ్గు గనుల వేలంలో కేంద్రానికి షాక్
మూడుసార్లు గడువు పొడిగించినా ఫలితం శూన్యం
హైదరాబాద్, మార్చి 3 : రాష్ట్రంలోని నాలుగు బొగ్గు గనుల వేలంలో కేంద్రప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. మూడుసార్లు గడువు పొడిగించినా ఈ గనుల కోసం ఒక్క సంస్థ కూడా బిడ్ దాఖలు చేయలేదు. సిరులు కురిపిస్తున్న సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. కల్యాణి బ్లాక్ -6, కోయగూడెం బ్లాక్ -3, సత్తుపల్లి బ్లాక్ – 3, శ్రావణపల్లి గనుల వేలానికి టెండర్లు పిలిచింది. మొదట కోయగూడెం బ్లాక్ -3కి మాత్రమే సింగిల్ బిడ్ వచ్చింది. మిగిలిన మూడింటికి ఒక్క బిడ్ కూడా రాలేదు. నిబంధనల ప్రకారం సింగిల్ బిడ్ వస్తే పరిగణనలోకి తీసుకోరు. ఫలితంగా గత డిసెంబర్లో రెండో దఫా టెండర్లను ఆహ్వానించి మూడుసార్లు గడువు పొడిగించింది. ఫిబ్రవరి 28తో ఆ గడువు కూడా ముగియటంతో బుధవారం బిడ్లు తెరిచారు. ఈసారి నాలుగింటిలో ఒక్కదానికీ సింగిల్ బిడ్ కూడా దాఖలు కాలేదు. ఈ నాలుగు గనుల్లో సర్వే కోసం సింగరేణి రూ.59 కోట్లు వెచ్చించింది. వీటిని తమకే అప్పగించాలని అటు సింగరేణి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి విన్నవించాయి. అయినా, కేంద్రం వేలానికి పెట్టింది. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తామంటే సహించబోమని టీజీబీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి హెచ్చరించారు.