Raj Bhavan | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వంపై రాజ్భవన్ వింత వైఖరి మరోసారి బయటపడింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్.. బాధ్యతాయుతంగా వ్యవహిరించడంలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల విస్తృత ప్రయోజనార్థం అసెంబ్లీలో ఆమోదించిన పంపిన బిల్లులపై ఏవైనా అభ్యంతరాలుంటే సరిచేసుకోవాలని ప్రభుత్వానికి సూచించాల్సిందిపోయి.. నేరుగా మీడియాకు లీకులు ఇచ్చారు. గవర్నర్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఆదేశించిననప్పటికీ పాత పద్ధతిలోనే ముందుకు సాగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను కొన్ని నెలలపాటు తన దగ్గరే అట్టి పెట్టుకున్న గవర్నర్.. సుప్రీంకోర్టు ఆదేశాలతో హడావిడిగా వాటి ఆమోదానికి సిద్ధపడ్డారు. అయితే.. మళ్లీ మూడు బిల్లులను తనవద్దే పెట్టుకొన్నారు. వీటిల్లో ప్రధానంగా ‘ది తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్ట సవరణ బిల్లు-2022’ ‘ది తెలంగాణ మున్సిపల్ లాస్ సవరణ బిల్లు -2022’ ‘డీఎంఈ పదవీ విరమణ వయసు పెంపు బిల్లు’లకు సంబంధించి కొన్ని కొర్రీలు పెట్టి.. అనధికారికంగా మీడియాకు లీకులు ఇచ్చారు.
‘బిల్లులను ఆమోదించండి మొర్రో..’ అంటూ ఎన్నో నెలలుగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్కు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నది. ఇన్ని నెలలుగా వాటి వైపు కన్నెత్తి చూడని గవర్నర్.. సుప్రీంకోర్టు ఆదేశాలతో బిల్లుల్లో కొర్రీలు వెతికారు. వైద్యవిద్యలో పాలనా పరమైన పోస్టుల వయోపరిమితి పెంపు బిల్లుకు సంబంధించి, పురపాలికల్లో మైనార్టీల రిజర్వేషన్లకు సంబంధించి, డీఎంఈ పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఆ ప్రశ్నలను బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడే ప్రతిపక్షాల అడిగాయి.
ఆనాడే వాటికి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు సరైన సమాధానాలు చెప్పారు. గవర్నర్ కూడా వాటిని పరిశీలించి ఉంటే ప్రభుత్వం సమాధానాలు ఇచ్చేదే. కానీ, కొన్ని నెలలపాటు బిల్లులను తొక్కిపట్టి.. ఇప్పుడు హడావిడిగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తి వివరణ కోరారు. దీంతో ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు ధోరణే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి మీడియాకు ఎలా లీకులు ఇస్తారని గవర్నర్ తమిళిసై, రాజ్భవన్ అధికారులను తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. ఈ తరహా వ్యవహారం గతంలో ఏ గవర్నర్ కూడా చేయలేదని, బీజేపీ పాలిత రాష్ట్రం కాదు కాబట్టే.. మరీ ఇంత కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.