Uttam Kumar Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): కృష్ణా ప్రాజెక్టులు, ఔట్లెట్లను అప్పగించారని ఒకవైపు కేంద్రజల్శక్తిశాఖ, మరోవైపు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)తోపాటు ఆయా సమావేశాల మినిట్స్ కూడా స్పష్టం చేస్తుండగా.. ఇంతవరకు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాత్రం దీనిపై నోరు విప్పడంలేదు. ఇరిగేషన్ అధికారులు మాత్రమే ఆ వార్తలను ఖండిస్తూ.. పత్రికలను తప్పుపడుతున్నారు తప్ప వారు కూడా స్పష్టతనివ్వడం లేదు.
మరోవైపు ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించి కేంద్రజల్శక్తిశాఖ, ఇంకోవైపు ఏపీ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతున్నాయి. తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతున్నా.. కంటితుడుపుగా సదరు మంత్రి గతంలో ఒక ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప పత్రికాముఖంగా ఇప్పటివరకు ఒక్క ప్రకటనా చేయలేదు. అసలు అమాత్యులు ఉన్నారా? ఉంటే ఆయనకు తెలిసే ప్రాజెక్టులను, ఔట్లెట్లను అప్పగించారా అంటూ తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వ లోగుట్టు బయటపడటంతోనే అమాత్యులు ముఖం చాటేశారని చెప్పుకుంటున్నారు.
మంత్రివర్యులు మాట్లాడరేం..?
ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీతో సహా తెలంగాణ సర్కారు అంగీకరించాయని కేంద్ర జల్శక్తి శాఖ, కేఆర్ఎంబీ సమావేశాల మినిట్స్ స్పష్టం చేస్తున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన 15 ఔట్లెట్లను అప్పగించేందుకు ఏపీ అంగీకరించగా, తెలంగాణ మాత్రం 15 ఔట్లెట్లలో విద్యుత్తు ప్రాజెక్టులు మినహాయించి మిగిలిన వాటి అప్పగింతకు అంగీకారం తెలిపినట్టు స్పష్టమవుతున్నది.
తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ సైతం ఇకపై బోర్డు నిర్వహణలోనే ప్రాజెక్టులు ఉంటాయని పత్రికాముఖంగా వెల్లడించారు. ఇరిగేషన్శాఖ సెక్రటరీ మాత్రం పత్రికలే తప్పుడు కథనాలు ప్రచురించాయని, ప్రాజెక్టులను అప్పగించలేదని పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు. ఒకవైపు తెలంగాణ జలహక్కులకు తీవ్ర విఘాతం వాటిల్లుతున్నా, దీనిపై ఇంత రభస జరుగుతున్నా, తెలంగాణ సమాజంలో ఆందోళన నెలకొన్నా ఇప్పటివరకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాత్రం ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.
లోగుట్టు బయటపడటంతోనే..
ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ అంగీకారం తెలిపిందని పత్రికల్లో వార్తలు వచ్చిన మరుసటి రోజే దానిని ఖండిస్తూ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటన చేశారు. హడావుడిగా ఇరిగేషన్ అధికారులతో సమీక్షన మంత్రి.. దాదాపు 15రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు మళ్లీ ఆ ఊసేత్తలేదు. బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తున్నారా? లేదా? అన్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కానీ, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కానీ ఇప్పటికీ నోరు మెదపడంలేదు.
అసలు ప్రభుత్వ మార్గదర్శకాలు లేకుండా అధికారులే సొంతంగా, రాష్ట్ర జలహక్కులను కాలరాసేలా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళా తీసుకున్నా తెలంగాణ ప్రయోజనాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. తెలంగాణకు ఆత్యంత ఆవశ్యకమైన అంశమైనప్పటికీ.. ప్రభుత్వం, మంత్రి మౌనం వీడడం లేదు.
16న మరోసారి సమావేశం..
ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించి తాజాగా ఈనెల 16న మరోసారి సమావేశం నిర్వహించాలని కేంద్రజలశక్తిశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీముఖర్జీ తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారికి, ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహాహర్రెడ్డికి, కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్కుమార్కు లేఖ రాశారు. పూర్తి యాక్షన్ప్లాన్తో సమావేశానికి రావాలని ఇరురాష్ర్టాలను ఆదేశించారు.
మొత్తంగా నెలరోజుల్లోగా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో కేంద్రం వేగంగా అడుగులు వేస్తున్నదని తేటతెల్లమవుతున్నది. ఇప్పటికే ఏపీ సైతం అందుకు ఉత్సాహాన్ని చూపుతున్నది. ఇదే జరిగితే తెలంగాణ జలహక్కులకు తీవ్ర విఘాతం వాటిల్లనుంది.