Errabelli Dayaker Rao | ఖిలావరంగల్ : రాష్ట్రంలో సచ్చిన పార్టీ కాంగ్రెస్, తలా తోక లేకుండా మాట్లాడే బ్రోకర్ పార్టీ బీజేపీ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ శివనగర్లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి మంత్రి దయాకర్రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. 40 ఏండ్ల రాజకీయ జీవితంలో తనకు నచ్చిన ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, కేసీఆర్ మినహా మిగతావారంతా బ్రోకర్లేనని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. తొమ్మిదేండ్ల క్రితం హైదరబాద్ ఎల్బీనగర్ స్టేడియంలో తాను, చంద్రబాబు నాయుడు, మోదీ ముగ్గురం కూర్చొని మాట్లాడుకున్న సంభాషణను మంత్రి దయాకర్రావు ఈ సందర్భంగా ఉదహరించారు.
రూ.400లు ఉన్న గ్యాస్ ధరను రూ.200 చేస్తానని నాడు మోదీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రూ.1250లు పెంచారని గుర్తు చేశారు. ధరలు పెంచినవారే ధరలు తగ్గించాలని ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బ్రోకర్ మాటలు ఎక్కువగా మాట్లాడే నాయకులు బీజేపీలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రజల జీవన స్థితిగతులు అధ్వానంగా ఉన్నాయన్నారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో బీజేపీ ముందున్నదన్నారు. దేశ ప్రజల మధ్య మతాల చిచ్చు పెడుతున్న బీజేపీని బొంద పెట్టాలన్నారు.
కాంగ్రెస్ హయాంలో పెన్షన్ రూ.200 ఉండేదని అయితే కొత్త పింఛన్ ఇవ్వాలంటే పింఛన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తేనే కొత్తవారికి అవకాశం వచ్చే పరిస్థితి ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ పాలన యావత్ దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. కులం, మతం, పార్టీ అని చూడకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ హయాంలో రూ.200 ఉన్న పెన్షన్ను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూ.2 వేలు చేశారని, అలాగే దివ్యాంగులకు రూ.3016లు ఇస్తున్నాడన్నారు. పేద వాళ్ల కోసం వరంగల్ నగరంలో దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద దవాఖానను సీఎం కేసీఆర్ కట్టిస్తున్నారని మంత్రి దయాకర్ రావు తెలిపారు.