మహబూబాబాద్: నలభై ఏండ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినన్ని మంచి పనులు మరెవరూ చేయలేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాద్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం నాంచారి మడూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. 30 ఇండ్లను లబ్ధిదారులకు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇంటి విలువ దాదాపు రూ.25 లక్షలు ఉన్నదని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. కేసీఆర్ చేస్తున్న మంచి పనులను గుర్తించి ఆయనకు అందరూ బాసటగా నిలబడాలని కోరారు. ఒక్క నాంచారి మడూర్ గ్రామంలోనే పెన్షన్ల కోసం రూ.1.42 కోట్లు వచ్చాయని, 512 మందికి పెన్షన్లు వస్తున్నాయని అన్నారు. గతంలో తెలుగుదేశంలో గెలిచినప్పుడు ఇన్ని పనులు కాకపోయేవని, కేసీఆర్ అడిగినన్ని డబ్బులు ఇస్తున్నారని చెప్పారు.
నాంచారి మడూర్ చెరువుకు నీళ్ళు తెస్తానని హామీ ఇచ్చానని, ఆ హామీని త్వరలోనే నెరవేరుస్తానని మంత్రి పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం శరవేగంగా పూర్తవుతున్నదన్నారు. కార్యక్రమంలో సభాధ్యక్షులుగా సర్పంచ్ గుంటక యాదలక్ష్మి, కలెక్టర్ శశాంక, జెడ్పీటీసి మంగళపల్లి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పసుమర్తి శాంత, ప్యాక్స్ చైర్మన్ హరి ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, పాలకుర్తి దేవస్థాన కమిటీ అధ్యక్షులు రామచంద్రయ్య శర్మ, ఎంపీపీ అంజయ్య, ఎంపీటీసీలు, నాయకులు, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.