రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల వేదికమీద నుంచి చెబుతున్న ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కేసీఆర్ ప్రయాణాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నం. ఆ దిశగా ప్రయాణిస్తున్నం. ఫలితాలు కనబడుతున్నయి. ఆ ఫలితాలు మన ముందరే కాదు యావత్ ప్రపంచం ముందు కూడా ఉన్నవని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. మనకు అపనమ్మకాలు ఎక్కువ. కానీ లక్ష్యశుద్ధి, చిత్తశుద్ధి, వాక్శుద్ధి ఈ మూడు తోడైతే ఏదైనా వందశాతం అయితదని సీఎం అన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఉదాహారణ అని పేర్కొన్నారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి పర్యటన గావించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సిరిసిల్లలో సకల సౌకర్యాలతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, సర్దాపూర్లో మార్కెట్యార్డు, గిడ్డంగులను, సిరిసిల్లలో నర్సింగ్ కళాశాలను, మండేపల్లిలో ఐడీటీఆర్ శిక్షణ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు.
అనంతరం కలెక్టరేట్ భవనంలో జరిగిన సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడుతూ.. సభాధ్యక్షులు, మున్సిపల్శాఖ మంత్రి కె.తారక రామారావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, వేదికను అలంకరించిన గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, సీఎస్ సోమేశ్కుమార్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, సభలో ఆసీనులైన అందరికీ నమస్కారం తెలిపారు. రాజన్న సిరిసిల్ల ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు తాను హృదయపూర్వక అభినందలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
పరిపాలన సంస్కరణల్లో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపిన సీంఎ ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జ్లిలా ఏర్పాటు కావడం జరిగిందన్నారు. జిల్లా పాలన వ్యవహారాలకు సంబంధించిన ముఖ్య కార్యాలయం కలెక్టరేట్ ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడకముందు ఎన్నో వాదప్రతివాదాలు జరిగినట్లు తెలిపిన సీఎం మీకు ఏది చేతకాదు అనే వాదనను ఖండించినట్లు చెప్పారు. ఇందుకు నిదర్శనమే ప్రస్తుతం మన కండ్లముందు ఉందన్నారు. రాష్ట్రంలో కడుతున్న అద్భుత సమీకృత కలెక్టరేట్ నిర్మాణాలకు డిజైన్ చేసింది మన తెలంగాణ బిడ్డ, ఆర్కిటెక్ట్ ఉషారెడ్డి అని వాటిని కడుతుంది తెలంగాణ ఇంజినీరు గణపతిరెడ్డి అని సీఎం పేర్కొన్నారు.