Ponnam Prabhakar | మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో వివాదంపై పొన్నం ప్రభాకర్ స్పందించారు. అడ్లూరి తనకు సోదరుడిలాంటి వారని తెలిపారు. కాంగ్రెస్లో మాకు 30 ఏళ్ల స్నేహబంధం ఉందని అన్నారు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం విడదీయరానిది అని అన్నారు.
మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ వివాదంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉంది. ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టేందుకు పీసీసీ రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే పొన్నం ప్రభాకర్, అడ్లూరితో టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హాజరయ్యే ముందు పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. అడ్లూరి లక్ష్మణ్పై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తనకు ఎవరిపైనా విద్వేషం ఉండదని తెలిపారు. కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేశారని అన్నారు. అడ్లూరి బాధపడ్డారని తెలిసి తీవ్రంగా విచారిస్తున్నానని అన్నారు. అడ్లూరి మనసు నొచ్చుకుని ఉంటే చింతిస్తున్నానని చెప్పారు.
కాగా, ఇదే సమయంలో అడ్లూరి లక్ష్మణ్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. ఇది చాలా చిన్న విషయమని.. సమసిపోతుందని అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. సమావేశం తర్వాత వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.
జూబ్లీహిల్స్ లో మంత్రులు పెట్టిన ప్రెస్ మీట్ లో లేటుగా వచ్చినా అడ్లూరి లక్ష్మణ్ ను “దున్నపోతు” అంటున్నా పొన్నం అన్న
మనకి టైం అంటే తెలుసు ఆ..దున్నపోతు గాడికి టైం గురించి ఎం తెలుసు… pic.twitter.com/g0F8wq38vL
— Arshad (@Iamarshad46) October 5, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఇన్చార్జి మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అందరూ వచ్చారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమయానికి రాలేకపోయారు. దీంతో పొన్నం అసహనానికి లోనయ్యారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో గుసగుసగా ‘మనకు టైం అంటే తెలుసు.. జీవితమంటే తెలుసు.. వారికేం తెలుసు ఆ..దున్నపోతు గానికి’ అంటుండగా మైక్ స్పీకర్లు ఆన్చేసి ఉండటంతో అది బయటకు వినిపించింది. అప్పటికే మీడియా కెమెరాల్లో అదంతా రికార్డయింది. మళ్లీ కొద్ది నిమిషాలకే ‘వస్తుండా? స్టార్ట్ అయినంక జాయిన్ అయితాడా?’ అంటూ మైనార్టీ నేతలను ఉద్దేశిస్తూ ‘మొదలు పెట్టండి’ అని ఆర్డర్ వేసినట్టుగా పొన్నం మాట్లాడారు.
మరో మంత్రి లేకుండా ప్రెస్మీట్ ఎలా మొదలుపెడుతామని మెనార్టీ నేతలు సందిగ్ధంలో పడి వెనుకముందాడారు. దీంతో మరోసారి పొన్నం మైక్ అందుకొని ‘మీరు మాట్లాడుతారా? నన్ను మాట్లాడుమంటారా?’ అంటూ దబాయిస్తున్నట్టుగా మాట్లాడారు. ఇదంతా కెమెరాల్లో రికార్డయింది. మీడియా సమావేశం కవరింగ్ కోసం వచ్చిన యూట్యూబర్లు ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా, నిమిషాల్లోనే వైరల్ అయింది. దీంతో నాలుక కరుచుకున్న పొన్నం ప్రభాకర్ ఖండన ప్రకటన చేశారు.