న్యూఢిల్లీ, ఆగస్టు 8: ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్.. ఏ రాష్ట్ర సీఎం చేయలేనంత రీతిలో యుద్ధం చేస్తున్నారని, అంత ధైర్యం దేశంలో ఏ సీఎంకూ లేదని ‘4 పీఎం’ న్యూస్ పేర్కొన్నది. మొన్నటి వరకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేసేవారని, అయితే తాజాగా సీఎం కేసీఆర్ నువ్వా నేనా అన్నట్టు కేంద్రంతో పోట్లాడుతున్నారని విశ్లేషించింది. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన చెందుతున్నారంటూ చెప్పింది. ‘సీఎం కేసీఆర్ మొదటి నుంచీ కేంద్రంపై చిన్నపాటి యుద్ధం చేస్తూ.. మోదీని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. కేంద్రంపై టెక్నికల్గా, తెలివిగా పోరాటం చేస్తున్నారు. ఇటీవల నీతి ఆయోగ్ సమావేశానికి ఇద్దరు సీఎంలు కేసీఆర్, నితీశ్ కుమార్ మాత్రమే హాజరు కాలేదు. నితీశ్ అనారోగ్య కారణాలతో గైర్హాజరు అయ్యారు.
నిజంగానే అనారోగ్యమా లేక కేంద్రంపై అలకో తెలియదు కానీ.. కేసీఆర్ మాత్రం సమావేశానికి ముందు నుంచే కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి పెద్ద లేఖ కూడా రాశారు. ఈ లేఖపై దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతున్నది. కేంద్రం, రాష్ర్టాలు జట్టుగా కూడి పనిచేయట్లేదని, ఈ విషయం చాలా బాధతో చెబుతున్నానంటూ లేఖలో రాశారు. రాష్ర్టాలకు కేంద్రం నిధుల విడుదలలో వివక్ష చూపిస్తున్నది నిజమే. ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు ఉద్దేశించిన అద్భుతమైన మిషన్ భగీరథ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. మిషన్ కాకతీయ కింద చెరువుల పూడిక తీశారు. దీంతో తెలంగాణలోని భూగర్భ జలాలు జీవం పోసుకున్నాయి. వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి చాలా ప్రోత్సాహం లభించింది. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖను దేశంలోని అందరు ముఖ్యమంత్రులకు పంపారు.
నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తానని ప్రకటించారు. అంతధైర్యం దేశంలో ఏ సీఎం చేయలేదు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రతిపక్ష నేతలు కూడా ప్రధాని రాగానే వినయంగా మాట్లాడారు. అందుకే సీఎంలతో ప్రధాని మాట్లాడుతున్న ఫొటోలను వైరల్ చేశారు. ఇదే దాని ముఖ్య ఉద్దేశం. కానీ కేసీఆర్ టీం మాత్రం ధైర్యంగా లేఖ రాసింది. 2024లో బీజేపీ గెలవడం అంత సులువు కాదని రాష్ర్టాల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ద్వారా కేంద్రానికి తెలిసింది. ఇక తెలంగాణలో తన ఉనికి చాటుకునేందుకు బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించింది. గత ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుచుకోగా.. ఈ సారి మరిన్ని సీట్లు గెలుచుకోవాలని బీజేపీ ఆశపడుతున్నది. మతం కార్డును వాడుకుని లబ్ధి పొందొచ్చని బీజేపీ ప్రయత్నించింది. భారీగా సభ ఏర్పాటుచేసినా రాష్ర్టానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదన్న విషయాన్ని కేసీఆర్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. రూపాయి విలువ ఎందుకు తగ్గుతున్నదనే విషయాన్ని ప్రెస్మీట్లో కేసీఆర్ నేరుగా మోదీ ఝూటా మాటలను వీడియోల రూపంలో ప్రదర్శించి తీవ్రంగా విరుచుకుపడ్డారు. మొన్న వచ్చిన నాలుగు లోక్సభ సీట్లు కూడా బీజేపీకి దక్కొద్దని కేసీఆర్ చూస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా.. ఎన్ని చేసినా తెలంగాణ అభివృద్ధి పథంలోదూసుకెళ్తున్న మాట మాత్రం ముమ్మాటికీ నిజం. మరి ఈడీ, సీబీఐ దాడులు ఇక్కడ కూడా కేంద్రంలోని బీజేపీ మొదలు పెడుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది’ అని 4పీఎం విశ్లేషించింది.
విపక్ష రాష్ర్టాలపై కేంద్రం దగా
తాము అధికారంలో ఉన్న రాష్ర్టాలకు నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇస్తూ.. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలకు మొండిచేయి చూపించడంలో కేంద్రంలోని మోదీ సర్కారు మరోసారి తన పక్షపాత వైఖరిని ప్రదర్శించింది. ఖేలో ఇండియా పథకంలో భాగంగా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆయా రాష్ర్టాలకు కేంద్ర క్రీడాశాఖ నిధులను కేటాయించింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలకు నిధుల్లో సింహభాగం కేటాయించగా, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలకు మొక్కుబడిగా విదిల్చారు.
బీజేపీ పాలిత రాష్ర్టాలకు కేటాయింపులు
గుజరాత్-రూ. 608.37 కోట్లు
ఉత్తరప్రదేశ్-503.02 కోట్లు
కర్ణాటక-128.52 కోట్లు
విపక్ష రాష్ర్టాలకు కేటాయింపులు
తమిళనాడు-33 కోట్లు
పశ్చిమబెంగాల్-26.77 కోట్లు
తెలంగాణ-24.11 కోట్లు
కేంద్రవర్సిటీల్లో వీసీలుగా ఎస్సీ, ఎస్టీలు ఒక్కొక్కరే
మొత్తం బోధనేతర సిబ్బంది-22,096
ఎస్సీ-2,063 , ఎస్టీ-1,186
ఓబీసీ-2,342, జనరల్-16,132
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి కేవలం ఒక్కొక్కరు చొప్పునే వీసీలుగా ఉన్నారు. ఓబీసీ వర్గానికి చెందిన వారు 8 మంది వీసీలుగా ఉన్నారు. ఇద్దరు రిజిస్ట్రార్లు ఎస్సీ వర్గానికి చెందిన వారు కాగా, ఐదుగురు ఎస్టీ వర్గానికి చెందిన వారు. మరో ముగ్గురు బీసీ వర్గానికి చెందిన వారు. బోధన, బోధనేతర సిబ్బందిలోనూ ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం తక్కువే. కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ సోమవారం లోక్సభలో ఈ వివరాలను వెల్లడించారు.