Munugode by Poll Results | మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సవాలుగా తీసుకున్నప్పటికీ.. అధికార పార్టీ దెబ్బకు అతలాకుతలమయ్యాయి. అధికార పార్టీని అందుకోలేకపోయాయి. బీజేపీ రెండో స్థానంలో, కాంగ్రెస్ మూడో స్థానంలో ఉండిపోయాయి. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో.. ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు బోసి పోయాయి. ఆ పార్టీ కార్యాలయాల్లో నేతలు ఎవరూ లేరు. మీడియాతో మాట్లాడేందుకు కూడా ముందుకు రావడం లేదు. ముఖం చాటేస్తున్నారు. కేవలం మీడియాతో ఫోన్ ఇన్ లోనే మాట్లాడుతున్నారు తప్ప.. బయటకు రావడం లేదు.
ఇక కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల సందడి లేదు. రెండో రౌండ్ ఫలితం వెలువడిన వెంటనే కౌంటింగ్ కేంద్రం నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బయటకొచ్చారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మండల పరిధిలోని ఓట్ల లెక్కింపు వరకు కూడా కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు. చౌటుప్పల్లో తాను ఆశించినంత మెజార్టీ రాకపోవడంతో.. తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తక్షణమే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి కూర్చున్నారు.