Gas EKYC | హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): గ్యాస్ సిలిండర్ ఈకేవైసీకి గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదని, డెలివరీ బాయ్ల వద్దే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి వినియోగదారులకు సూచించారు. కేవైసీ కోసం గుంపులుగా ఆఫీసులకు వచ్చి ఇబ్బందులు పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు.
గ్యాస్ కేవైసీకి ఎలాంటి తుది గడువు నిర్ణయించలేదని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా వినియోగదారుల ఇంటి వద్దకే వెళ్లి కేవైసీ పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించిందని, వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రూ.500లకే సిలిండర్ హామీ అమలుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు అందలేదని తెలిపారు. డెలివరీ బాయ్స్ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక యాప్ ద్వారా కేవైసీని పూర్తి చేయొచ్చని సూచించారు. ఒకవేళ ఏదైనా కారణంతో అక్కడ కేవైసీ పూర్తికాని వారే ఏజెన్సీ ఆఫీసులకు వెళ్లాలని కోరారు.