మహబూబాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం
హైదరాబాద్, ఫిబ్రవరి 25 : తెలంగాణను బాల్య వివాహరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. బాల్యవివాహాలు అత్యధికంగా జరిగే జిల్లాల్లో మహబూబాబాద్ ఒకటిగా తేలడంతో ప్రభుత్వం ఆ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా స్వీకరించింది. దీనిలో భాగంగా రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఆ శాఖ అధికారులు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామసభలు నిర్వహించారు. మహిళా సంఘాల ప్రతినిధులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు చేసుకొన్నవారికి ప్రభుత్వ పథకాలను నిలిపివేయడంతోపాటు రెండేండ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామని జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. గత సంవత్సరం జూన్లో చేపట్టిన ఈ కార్యాచరణ వల్ల ప్రజల్లో అవగాహన పెరగడంతో జిల్లాలో గతేడాది ఏకంగా 102 బాల్యవివాహాలను అడ్డుకోగలిగారు.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నిలుపుదల
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకంతో ఇప్పటికే బాల్యవివాహాలు గణనీయంగా తగ్గాయి. కొన్ని గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా బాల్యవివాహాలు జరుగుతుండటంతో ప్రభుత్వం చైల్డ్లైన్ సేవలను విస్తృత పరిచింది. బాల్యవివాహాల వల్ల ఎదురయ్యే సమస్యలపై ప్రభుత్వం ఊరూరా అవగాహన కల్పించింది. ఫలితంగా 2019 నుంచి రాష్ట్రంలో బాల్యవివాహాలకు అడ్డుకట్ట పడుతున్నది.