తిమ్మాపూర్, జూలై 14: తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్లోని మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. గన్నేరువరం మండలం గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు మాజీ సర్పంచ్ భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే పీఏ వేధింపుల కారణంగా ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు మాజీ సర్పంచ్ భర్త బేతల్లి రాజేందర్ రెడ్డికి గుండ్లపల్లిలో సిమెంట్ బ్రిక్స్ ఉంది. సోమవారం రాత్రి బెజ్జంకి మండలానికి చెందిన ఇద్దరు, గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం సేవిస్తుండగా రాజేందర్ రెడ్డి వారిని ప్రశ్నించాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగి కొట్లాటకు దారితీసింది. ఈ ఘటనపై సదరు వ్యక్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మంగళవారం రాజేందర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. తనపై దాడి చేశారంటూ రాజేందర్ రెడ్డి సైతం ఫిర్యాదు చేయగా అవతలి వ్యక్తులపై కూడా కేసు నమోద అయింది.
అయితే.. ఈ గొడవలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ప్రధాన అనుచరుడు, అదే గ్రామానికి చెందిన మురళీధర్ రెడ్డి జోక్యంతోనే తనపై ఎస్సీ ఎస్టీ కేసు అయ్యేలా చేశారనే విషయాన్ని మనసులో పెట్టుకున్నాడు రాజేందర్ రెడ్డి. మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు అతడు పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి వల్లే తన భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని రాజేందర్ రెడ్డి భార్య సమత మీడియాకు తెలిపింది.