దళారులు అడుగుపెడితే కఠిన చర్యలు: మంత్రి నిరంజన్రెడ్డి
కేపీహెచ్బీ కాలనీ, మార్చి 27: రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతకు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఆధునిక సమీకృత మార్కెట్లను నిర్మిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. రైతు బజారుల్లోకి దళారులను రానీయవద్దని, ఎవరైనా వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో రూ.15 కోట్లతో ఆధునికీకరించిన మోడల్ రైతుబజార్ను మంత్రులు హరీశ్రావు, మల్లారెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. రైతుల, వినియోగదారుల సౌకర్యార్థం ఆధునిక హంగులతో నిర్మిస్తున్న రైతుబజార్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్, శంభీపూర్ రాజు పాల్గొన్నారు.