కరీంనగర్ ప్రతినిధి, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీలో ముసలం పుట్టించాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఇటీవలే కాషాయం కప్పుకొన్న ఈటల మధ్య విభేదాలు పొడసూపాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టడం లేదని అధ్యక్ష హోదాలో ప్రకటించిన బండి సంజయ్ మాటలను బేఖాతరు చేస్తూ స్వతంత్ర అభ్యర్థి రవీందర్సింగ్కు ఈటల మద్దతు ప్రకటించడం.. ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు రవీందర్సింగ్కు ఓటువేయడంతో లుకలుకలు బయటపడ్డాయి. రవీందర్సింగ్కు ఓటేసిన ముగ్గురు కార్పొరేటర్లకు రాష్ట్రపార్టీ నోటీసులు జారీచేసింది. పార్టీ అనుమతి లేకుండా స్వతంత్ర అభ్యర్థిని ఎలా బలపరుస్తారని నోటీసులో ప్రశ్నించినట్టు సమాచారం. నోటీసులకు వివరణ ఇవ్వాలని ముగ్గురిని ఆదేశించినట్టు తెలుస్తున్నది. అయితే సదరు కార్పొరేటర్లు ఈ నోటీసులను సీరియస్గా తీసుకోలేదని స్థానిక బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఈ ముగ్గురు కార్పొరేటర్ల వెనుక ఈటల హస్తం ఉన్నదని స్థానిక నేతలు అంటున్నారు.
కరీంనగర్లో స్వతంత్ర అభ్యర్థిని బలపరచాలని సోషల్ మీడియాలో బాజాప్తా వీడియో సందేశం ఇచ్చిన ఈటల రాజేందర్కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. ముగ్గురు కార్పొరేటర్లకు మాత్రం ఇవ్వడమేమిటని స్థానిక బీజేపీ నేతలు అధిష్ఠానాన్ని ప్రశ్నించినట్టు సమాచారం. కార్పొరేటర్లకు ఒక నీతి.. ఎమ్మెల్యేలకు ఒక నీతా? అని వాపోయినట్టు తెలుస్తున్నది. రవీందర్ సింగ్ తరపున ఈటల చేసిన ప్రచారం.. వీడియో సందేశాన్ని అధిష్ఠానం ముందుంచినట్టు తెలుస్తున్నది. పైగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్లోనే ఆయన అభిప్రాయానికి భిన్నంగా ఈటల వ్యవహరించడమేమిటని నిలదీస్తున్నట్టు సమాచారం.
చినికిచినికి గాలివాన అయినట్లుగా.. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం బీజేపీలో రగడ పుట్టించింది. అధిష్ఠానం నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించడమే కాకుండా.. బండి సంజయ్ అభిప్రాయానికి వ్యతిరేకంగా సదరు రవీందర్సింగ్ను బీజేపీలోకి తీసుకొనేందుకు రాజేందర్ ప్రయత్నిస్తున్నారని బండి వర్గీయులు మండిపడుతున్నారు. ఇందుకోసం రాజేందర్ తన ప్రయత్నాలను మొదలు పెట్టగా.. మరో వర్గం అడ్డుపడుతున్నట్టు తెలుస్తున్నది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చినప్పటినుంచి పార్టీ వ్యవహారం నచ్చక ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్తో కలిసి నడిచారు. ఈటల ఇలాగే వ్యవహరిస్తే తాము టీఆర్ఎస్లో చేరుతామంటూ మరో నలుగురు గులాబీ నేతలను ఆశ్రయించినట్టు తెలిసింది. ఈటలకు నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టకపోతే.. పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోవడం ఖాయమని ఆ పార్టీలో ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది.