హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు బస్సు చార్జీల్లో పెంపు ఉండదని, సాధారణ చార్జీలతోనే నడుపుతున్నట్టు ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ టికెట్ బుక్ చేసుకొన్న వారికి తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్టు చెప్పారు. గురువారం హైదరాబాద్ బస్భవన్లో ఉన్నతాధికారులతో ఆయన ఆన్లైన్ ద్వారా సమీక్షించారు. సజ్జనార్ మాట్లాడుతూ, ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్డ్ టికెట్ బుకింగ్ గడువును 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచామని తెలిపారు. జూన్ వరకు బుకింగ్ సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంజీబీఎస్లో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సూచించారు.
7 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు
సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులు 7 నుంచి 14 వరకు నడపాలని నిర్ణయించినట్టు సజ్జనార్ తెలిపారు. 585 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్టు చెప్పారు. ఏపీలోని అమలాపురానికి 125, కాకినాడ 117, కందుకూరు 83, నర్సాపురం 14, పోలవరం 51, రాజమండ్రి 40, రాజోలు 20, ఉదయగిరి 18, విశాఖపట్నం 65, నెల్లూరుకు 20 బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. 11 నుంచి 14 వరకు ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్రోడ్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి నుంచి బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. ఏపీ నుంచి తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం 16 నుంచి 18 వరకు మరో 212 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.