ముషీరాబాద్, నవంబర్ 9: దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీజేపీలో దళిత బిడ్డలెవ్వరూ కొనసాగవద్దని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బీజేపీ దళిత వ్యతిరేక చర్యలకు దిగడంతోపాటు వివక్ష, దాడులకు పాల్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ విద్యానగర్లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో వంగపల్లి మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాడులు, లైంగికదాడులు పెచ్చరిల్లినా నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. బీజేపీ నేతలు చెప్పే కల్లబొల్లి మాటలను దళితులెవ్వరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అగ్రవర్ణాల కొమ్ముకాసే బీజేపీని గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకోవాలని, మునుగోడు ఎన్నికల తరహా ఓటుతో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని సూచించారు.