Jagtial | జగిత్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్పై తీర్మానించిన అవిశ్వాసం వీగిపోయింది. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జోక్యం చేసుకుని సయోధ్య కుదర్చడంతో సభ్యుల మధ్య అంతర్గత వివాదానికి తెరపడింది. బుధవారం జరిగిన సమావేశానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో బలపరీక్ష ఊసేలేకుండా పోయింది.
వివరాల్లోకి వెళితే.. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న బోగ శ్రావణి గతేడాది చైర్పర్సన్, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ వైస్చైర్మన్గా ఉన్న గోలి శ్రీనివాస్కు ఇన్చార్జి చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. కాగా, గత నెలలో గోలి శ్రీనివాస్ తనకు ఇన్చార్జి చైర్మన్ బాధ్యతల నుంచి మినహాయించాలంటూ, జిల్లా అదనపు కలెక్టర్కు నివేదించారు. ఇదే టైంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్పై అవిశ్వాసం పెడుతూ, దాదాపు 30 మంది కౌన్సిలర్లు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో బుధవారం జగిత్యాల మున్సిపల్ సర్వసభ్య సమావేశ మందిరంలో అవిశ్వాసానికి సంబంధించిన సమావేశం నిర్వహించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కౌన్సిలర్ల మధ్య నెలకొన్న చిన్నచిన్న సమస్యల నేపథ్యంలోనే అవిశ్వాసం ప్రతిపాదించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత రంగంలోకి దిగి సయోధ్య కుదర్చారు. పార్టీ అందరికీ అవకాశాలు ఇచ్చిందని, భవిష్యత్తులో అందరికీ సమానావకాశాలు ఉంటాయని భరోసా కల్పించారు. విశ్వాస తీర్మానంపై పునరాలోచన చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ కవిత సూచనల మేరకు కౌన్సిలర్లు వెనక్కితగ్గారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం 11 గంటలకు జగిత్యాల మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానంపై సమావేశానికి గైర్హాజరయ్యారు. సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లతో పాటు, ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. 48 మంది కౌన్సిలర్లు ఉన్న కౌన్సిల్లో కేవలం 10 మంది మాత్రమే హాజరు కావడంతో అవిశ్వాసం వీగిపోయినట్లుగా ఆర్డీఓ నర్సింహమూర్తి ప్రకటించారు.