సీట్లు మిగిలాయని పదే పదే ప్రవేశాలు వద్దు
నీట్ కౌన్సెలింగ్ నిర్వహణకు పరిమితి ఉండాలి
మెడికల్ కౌన్సెలింగ్ కమిటీకి సుప్రీం సూచన
సీట్లు మిగిలిపోవడం ఇదేం తొలిసారి కాదు
మూడేండ్ల కోర్సు కోసం ఏడాదిన్నర తర్వాత అడుగుతారా అని విద్యార్థులకు ప్రశ్న
ప్రత్యేక కౌన్సెలింగ్పై తీర్పు నేటికి వాయిదా
న్యూఢిల్లీ, జూన్ 9: నీట్-పీజీ ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహణకు పరిమితి ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. విద్య, ప్రజారోగ్యం అంశాల్లో రాజీపడి విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించొద్దని సూచించింది. జస్టిస్ ఎమ్మార్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్లతో కూడిన ధర్మాసం ఈ వ్యాఖ్యలు చేసింది. నీట్ పీజీ కౌన్సెలింగ్లో మిగిలిపోయిన 1,456 సీట్ల భర్తీకి మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం విచారణ జరిపింది. ‘స్పెషల్ స్ట్రే రౌండ్, స్పెషల్ స్పెషల్ స్ట్రే రౌండ్.. ఇలా ఎన్ని రౌండ్లు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. దీనికి ఓ పరిమితి ఉండాలి’ అని కేంద్రానికి సూచించింది.
‘చాలా ఏండ్లుగా పీజీ మెడికల్ సీట్లు మిగులుతున్నాయి. 8-9 సార్లు కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత కూడా కొన్ని సీట్లు మిగిలిపోయాయని, మూడేండ్ల కోర్సులో చేరడానికి మీరు ఏడాదిన్నర తర్వాత వచ్చి అడ్మిషన్లు అడుగుతారా? వైద్య విద్య, ప్రజల ఆరోగ్యం విషయం లో రాజీపడమంటారా?’ అని విద్యార్థులను ప్రశ్నించింది. ఈ పిటిషన్లపై విచారణను ముగించింది. తీర్పును శుక్రవారానికి వాయిదా చేసింది. విచారణను ముగిస్తూ సుప్రీం కోర్టు కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ బల్బీర్ సింగ్ను ఉద్దేశించి.. ‘ఈ పిటిషన్లను విరోధ భావంతో చూడొద్దు. సాంకేతిక అంశాలకే కట్టుబడి ఉండొద్దు. ఇది 1,400 మెడికల్ పీజీ సీట్లకు సంబంధించిన విషయం. ఇది చిన్న సంఖ్యేమీ కాదు. ప్రభుత్వానికి వైద్యులు కావాలి. పీజీ చేసిన వైద్యులు కావాలి. సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కావాలి. దేశంలో వైద్యుల కొరత ఉంది’ అని వ్యాఖ్యానించింది.
9 సార్లు కౌన్సెలింగ్ నిర్వహించాం
అంతకుముందు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పీజీ సీట్లు మిగిలిపోవడంపై సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. పీజీ సీట్ల భర్తీకి 9 సార్లు కౌన్సెలింగ్ నిర్వహించినట్టు అందులో తెలిపారు. అడ్మిషన్లకు ఉపయోగించిన సాఫ్ట్వేర్ ప్రస్తుతం క్లోజ్ అయిందని, మిగిలిన సీట్లను భర్తీ చేయలేమని స్పష్టం చేశారు. దీనిపై కోర్టు స్పంది స్తూ.. ‘మేం విద్యార్థుల గురించి మాత్రమే ఆలోచించట్లేదు. దేశం గురించి ఆలోచిస్తున్నాం. దేశంలో 1,400 మంది సూపర్ స్పెషలిస్టు డాక్టర్లు తయారైతే ప్రజలకు మంచి ది. ఇప్పుడు ఈ సీట్లు భర్తీ చేయకుండా ఉంటే ఎవరికి లాభం? వాదనలకు బదులుగా పరిష్కారం కోసం ఆలోచించండి’ అని ఏఎస్జీ బల్బీర్ సింగ్కు సూచించింది. దీనిపై బల్బీర్ సింగ్ ఏటా కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందన్న దానిపై వివరాలు సమర్పించారు. మిగిలిన సీట్లు నాన్-క్లినికల్ విభాగానికి చెందినవని తెలిపారు. ఈ సీట్లలో చేరడానికి విద్యార్థులు అంతగా ఆసక్తి చూపరని, అందుకే ఏటా సీట్లు మిగిలిపోతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే అడ్మిషన్లు ముగిసి ఫిబ్రవరిలోనే తరగతులు ప్రారంభం అయ్యాయని చెప్పారు. ఈ సమయంలో క్లాసులను ఆపి మళ్లీ అడ్మిషన్లు నిర్వహించడం భావ్యం కాదన్నారు. మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహిస్తే 2022 నీట్పై కూడా ప్రభావం పడుతుందన్నారు. నేషనల్ మెడికల కౌన్సిల్ తరఫున అడ్వొకేట్ గౌరవ్ శర్మ వాదనలు వినిపించారు.