హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తుండటంపై కేంద్రం ప్రశంసలే కాదు.. నిధులు కూడా ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ, యునిసెఫ్ నిర్వహిస్తున్న ‘నేషనల్ వాటర్ శానిటేషన్ హైజీన్ కాంక్లేవ్ 2022’లో గురువారం కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ శుభ్రమైన తాగునీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని ప్రశంసించారు. దీనిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలపై కేంద్రం ప్రశంసలు కురిపించడమే కాకుండా.. రావాల్సిన నిధులు కూడా విడుదల చేయాలని కోరారు. మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫారసులను గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన మిషన్ భగీరథ కింద రాష్ట్రంలోని 23,930 గ్రామీణ ఆవాసాల్లో 54.06 లక్షల నల్లా కనెక్షన్ల ద్వారా 2.05 కోట్ల జనాభాకు మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. శుద్ధజలం సరఫరాలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. నిర్దేశిత 2024 కంటే ముందే లక్ష్యాన్ని చేరుకొన్నదని కేంద్రం పలుమార్లు ప్రశంసించిందని, దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ నుంచి స్ఫూర్తి పొందాలని సూచించిందని గుర్తు చేశారు.