Congress Cabinet | హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు గురువారం ప్రమాణస్వీకారం చేసిన 11 మంది మంత్రుల శాఖలు ఇంకా తేలలేదు. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారన్న అంశంపైనా ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ప్రమాణస్వీకారం చేసిన మంత్రులెవరూ బాధ్యతలు స్వీకరించలేదు. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామాను సమర్పించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ఖర్గే, కేసీ తదితరులను ఆయన కలిశారు.
వారితో మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించారు. శాఖల కేటాయింపుపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ప్రభుత్వవర్గాలు స్పందించాయి. మంత్రులకు శాఖలు కేటాయించలేదని ప్రకటించాయి. మంత్రివర్గంలోకి మరో ఆరుగురు కొత్త మంత్రులకు అవకాశముండగా, దీనిపైనా కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం రేవంత్రెడ్డి చర్చించినట్టు తెలిసింది. శనివారం అసెంబ్లీ కొలువుదీరనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉదయాన్నే ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు రానున్నారు. ఆ తర్వాతే మంత్రులకు శాఖల కేటాయింపు, మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వస్తుందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన లోక్సభ సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. ఢిల్లీలో లోకసభ స్పీకర్ ఓం బిర్లాను స్వయంగా కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మలాజిగిరి లోక్సభా స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్రెడ్డి ఎంపీగా గెలిచారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. శనివారం రేవంత్రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్పీకర్ను కలిసిన వారిలో రేవంత్తోపాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్చార్జి మాణిక్కం ఠాకూర్ కూడా ఉన్నారు.