హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా రాష్ట్రంలో దాదాపు 40% మంది టీచర్లు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో 1.20 లక్షల మంది ఉపాధ్యాయులు ఉండగా.. వీరిలో 40 వేల పైచిలుకు టీచర్లు బదిలీ అవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ రూపకల్పనపై విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన సోమవారం సమీక్షించారు. జీవో-317లో భాగంగా బదిలీ అయిన టీచర్లకు తాజా బదిలీల్లో అవకాశాలు తక్కువని అధికారులు చెప్తున్నారు. బదిలీకి రెండేండ్ల సర్వీసు తప్పనిసరి నిబంధన ఇందుకు కారణం. నిరుడు స్థాన చలనం పొందినవారు 25 వేలకు పైగా ఉన్నారు.
మార్గదర్శకాలిలా !
ప్రభుత్వ, స్థానిక సంస్థల టీచర్లకు యాజమాన్యాల వారీగా పదోన్నతులు, బదిలీలు చేపడుతారు. సీనియార్టీ లిస్ట్లు యాజమాన్యాల వారీగానే విడుదల చేస్తారు.
పరస్పర బదిలీలు, అంతర్ జిల్లా బదిలీలు, స్పౌజ్ కోటా బదిలీల్లో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వచ్చిన టీచర్లు సీనియార్టీ జాబితాలో చివరన ఉంటారు.
కొత్త జోనల్ విధానం ప్రకారమే స్కూల్ అసిస్టెంట్, హెచ్ఎం గ్రేడ్-2 పోస్టులకు పదోన్నతులు కల్పించి, బదిలీలు చేపడుతారు.
గరిష్ఠంగా ఎనిమిదేండ్ల సర్వీసు పూర్తయిన వారిని బదిలీ చేయడం తప్పనిసరి కాగా, కనిష్ఠంగా రెండేండ్ల సర్వీసు పూర్తయిన వారు కూడా బదిలీకి అర్హులే.
ఏడు వేలకు పైగా ఎస్జీటీలు ఖాళీ
టీచర్ల పదోన్నతుల కారణంగా రాష్ట్రంలో మరో ఏడు వేలకుపైగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉన్నది. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించడంతో ఆయా పోస్టులు ఖాళీ కానున్నాయి. ఇప్పటికే గుర్తించిన ప్రకారం 6,500కు పైగా ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉండగా, తాజాగా మరో ఏడువేల ఖాళీలు ఏర్పడనున్నాయి. దీంతో మొత్తంగా 13,500 ఎస్జీటీ పోస్టులను టీఆర్టీ ద్వారా భర్తీచేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
సంక్రాంతి టీచర్లకు సుదినం
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టేలా సీఎం కేసీఆర్ ఆదేశాలివ్వడం సంతోషదాయకం. ఈ ఏడాది సంక్రాంతి టీచర్లందరికీ సుదినం. చేపట్టాల్సిన ప్రక్రియపై కొన్ని సూచనలు చేశాం. పదోన్నతులు, బదిలీలతోపాటే పండిట్, పీఈటీల అప్గ్రెడేషన్ ప్రక్రియను చేపట్టాలని కోరాం. దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
– శ్రీపాల్రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, టీటీజేఏసీ చైర్మన్
త్వరలో షెడ్యూల్ విడుదల
సంక్రాతి పర్వదినాన టీచర్లకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ను విడుదల చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ ప్రక్రియను ఎటువంటి అపోహలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా చేపట్టాలని సూచించారు. తొలుత ప్రాధానోపాధ్యాయులతో ప్రారంభించి అంచెలవారీగా మిగతా టీచర్లకు పదోన్నతులు కల్పిస్తాం. రాష్ట్రంలో 9,266 టీచర్లకు పదోన్నతులు లభిస్తాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదలవుతుంది. మాడల్స్కూళ్లు, కేబీజీవీ టీచర్లకు సైతం బదిలీలు చేపడుతాం. టీచర్లకు శుభవార్తను చెప్పిన సీఎం కేసీఆర్కు విద్యాశాఖ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. -సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
ఉపాధ్యాయులకు శుభ సంక్రాంతి
సంక్రాంతి రోజున ప్రభుత్వం టీచర్లకు శుభవార్త చెప్పడం హర్షణీయం. ఎస్జీటీ మిత్రులు, పీఎస్ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందుతారు. పీఈటీ, పండిట్ పోస్టులకు కూడా పదోన్నతులు లభిస్తాయి.
-కూర రఘోత్తంరెడ్డి,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయాలి
పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్చేసి, పదోన్నతులు కల్పించాలి. జీవో-317 అప్పీళ్లు, కోర్టు కేసులు, స్పౌజ్ కేసులను సైతం పరిగణనలోనికి తీసుకోవాలి. నూతనంగా ఏర్పడ్డ కొత్త జిల్లాలవారీగా క్యాడర్స్ట్రెంత్ను ప్రకటించి, అన్ని క్యాటగిరీల వారికి బదిలీలు, పదోన్నతుల్లో అవకాశం కల్పించాలి.
– చెన్నయ్య, పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వానికి ధన్యవాదాలు
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు అవకాశం కల్పించడం హర్షణీయం. ఉపాధ్యాయులతో చర్చించి నిర్ణయం వెలువరించడం సంతోషదాయకం. విద్యకు ఆటంకం లేకుండా బదిలీలు చేపట్టడం, ఏప్రిల్ 23న రిలీవ్ కావాలన్న నిర్ణయాన్ని సంపూర్ణంగా అంగీకరించాం. టీచర్లకు తీపికబురు అందించిన సీఎం కేసీఆర్కు, మంత్రులు, ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– జంగయ్య, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు