హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఎన్ని కరోనా వేరియంట్లు పుట్టుకొచ్చినా ప్రస్తుతానికి దేశానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి తెలిపారు. ఏ వేరియంట్ వస్తే ఆ వేరియంట్కు తగ్గట్టు రోగ నిరోధకత స్పందిస్తున్నదని వెల్లడించారు.
దేశ ప్రజల్లో అభివృద్ధి చెందిన ఆరోగ్య ప్రమాణాలతో మొండి వేరియంట్లను ఎదుర్కొనే రోగ నిరోధకత పెరిగిందని వివరించారు. అందులో వ్యాక్సిన్ల పాత్ర కీలకమని అన్నారు. కొవిడ్పై బుధవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడిన ఆయన.. కొవిడ్ వేవ్ల వల్ల మనలో హైబ్రిడ్ ఇమ్యూనిటీ బలపడిందని చెప్పారు. చైనా, అమెరికాను ఇబ్బంది పెడుతున్న వేరియంట్ల ప్రభావం భారత్లో ఉండదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఒమిక్రాన్ను హైబ్రిడ్ ఇమ్యూనిటీ తొక్కి పెట్టేస్తున్నదని వివరించారు.