Bandi Sanjay : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే సభకు బండి దూరమయ్యారు. బీజేపీ పెద్దలు, స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ కార్యక్రమంలో ఎంపీకి చోటు దక్కలేదు. మోడీ సభకు ఆహ్వానితుల జాబితాలో బండి పేరు లేదు.
ఎందుకంటే.. బండి సంజయ్ కుమారుడు పోక్సో(POCSO) కేసులో ఇరుకుక్కోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఒకవేళ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అయిన బండి సంజయ్ను సభకు ఆహ్వానిస్తే అభాసుపాలవ్వడం తప్పదని భావించి బీజేపీ నాయకత్వం ఆయనను పక్కన పెట్టేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ బీజేపీలో తన మార్క్ రాజకీయం నడిపే బండి సంజయ్కు దిమ్మతిరిగే షాక్. ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సభలో ఎన్నో గొప్పలు చెప్పాలని కలలు కన్న బండి అనూహ్యంగా సభకు దూరమయ్యారు. కుమారుడు భగీరథ్పై పోక్సో కేసు నమోదవ్వడంతో ఆహ్వానితుల జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు.
ప్రధాని సభకు గవర్నర్ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర పెట్రోలియం మంత్రి హర్షదీప్ సింగ్ పూరీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ సురేశ్ గోపీ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను మాత్రమే ఆహ్వానించారు. ఆదివారం సికింద్రాబార్ పరేడ్ గ్రౌండ్లో సాయంత్రం 4 గంటల నుంచి మొదలవ్వనుంది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ భారతీయ జనతా పార్టీ కీలక నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక 17 ఏళ్ల బాలికకు బలవంతంగా మద్యం తాగించి, హైదరాబాద్లోని మొయినాబాద్ ఫామ్హౌస్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వేధింపుల కారణంగా బాధితురాలు రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. చివరికి నిన్న అర్ధరాత్రి ఆమె పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే, మొదట్లో బండి భగీరథ్పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనుకాడటంతో పోలీస్ స్టేషన్ వద్ద సుమారు ఆరు గంటల పాటు హైడ్రామా చోటుచేసుకుంది. ఆ తర్వాత బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.