హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీపై విచారణ పేరుతో ఏపీ సీఐడీ పోలీసులు కఠిన చర్యలు చేపట్టరాదని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇదే సమయంలో సీఐడీ దర్యాప్తును అడ్డుకునేందుకు నిరాకరించింది. దర్యాప్తు కొనసాగించుకోవచ్చని, ఈ వ్యవహారంపై తాము తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు 30 మంది మేనేజర్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పేర్కొంటూ జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. వీటిపై అభ్యంతరం ఉంటే మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ అత్యవసరంగా వెకేషన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు.