హైదరాబాద్ : నూతన మెడికల్ కాలేజీల ఏర్పాట్లను తనిఖీ చేసేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) డిసెంబర్లో రాష్ట్రానికి రానున్నది. రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రామగుండం, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డిలో అందుబాటులోకి రానున్నాయి. అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్ఎంసీకి దరఖాస్తు చేసింది.
ఎన్ఎంసీ బృందం వచ్చే లోగా అన్ని ఏర్పాట్లు చేయాలనే లక్ష్యంతో వైద్యారోగ్య శాఖ కృషి చేస్తున్నది. నిబంధనల మేరకు అవసరమైన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది. కాలేజీ నిర్మాణం, లెక్చర్ హాల్, ల్యాబ్స్, లైబ్రరీ, డెమో రూమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, విద్యార్థుల హాస్టల్ వసతి వంటి సదుపాయాలను ఎన్ఎంసీ బృందం పరిశీలించనున్నది. వచ్చే ఏడాది జూన్లో ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నది.