నవీపేట్/మాక్లూర్, డిసెంబర్ 21: ఆస్తి కోసం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా అంతమొందించిన కేసులో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచి గురువారం రెండు మృతదేహాలను కనుగొన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్కు చెందిన కూన ప్రసాద్ కుటుంబాన్ని అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ కిరాతంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆస్తి కోసం ప్రసాద్తోపాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లను.. ప్రశాంత్ మరో ముగ్గురితో కలిసి హతమార్చాడు. ఒక్కొక్కరిని ఒక్కో ప్రాంతానికి తీసుకెళ్లి పొట్టనపెట్టుకున్నాడు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు రం గంలోకి దిగారు.
సాంకేతిక అంశాలతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా.. ఈ వరుస హత్యల విష యం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో పిల్లలు, చెల్లెళ్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రసాద్, ఆయన భార్య సాన్విక మృతదేహాలు దొరకలేదు. చివరకు పోలీసుల విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మాక్లూర్ మండలం మదన్పల్లి అటవీ శివారులో ప్రసాద్ను పూడ్చిపెట్టినట్టు తెలిపారు. పోలీసులు అక్కడికెళ్లి తవ్వకాలు జరిపి మృతదేహాన్ని వెలికితీశారు. కుళ్లిపోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అలాగే.. నవీపేట మండలం యంచ రైల్వే బ్రిడ్జి సమీపంలో గోదావరి నది ఒడ్డుకు కొట్టుకొచ్చిన సాన్విక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా కుళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం చేశారు.