వేల్పూర్, మే 12: తెలంగాణపైకి ద్రోహులు ఎగురుకొంటూ వస్తున్నారని.. రాష్ట్ర ప్రజలు పైలంగా ఉండాలని రోడ్లు భవనాలశాఖల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్న కేసీఆర్ మీదికి తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై దండు కట్టాయని తెలిపారు. ప్రజలే వారికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూరు, ఏర్గట్ల, మోర్తాడ్ మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన 300 మంది వివిధ పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్లో చేరారు. మంత్రి వేముల వారిని గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లనే దేశమంతటా కరెంటు కటకట ఉన్నా.. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్తు సరఫరా జరుగుతున్నదని చెప్పారు. అంబానీ, అదానీలకు దేశాన్ని అమ్ముతున్న రాష్ర్టాలకు అన్యాయం తీవ్ర అన్యాయం చేస్తున్నదన్నారు. రోజూ అవాకులు చవాకులు మాట్లాడుతున్న బండి సంజయ్, అర్వింద్లకు దమ్ముంటే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయహోదా తీసుకొని రావాలని డిమాండ్చేశారు. మన రాష్ర్టానికి వస్తున్న పరిశ్రమలను గుజరాత్కు తరలించుకపోతుంటే.. నలుగురు బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ర్టానికి అన్యాయం జరుగుతుంటే తెలంగాణ ఎంపీలుగా ఎట్లా ఉండగలుగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ కన్నా ముందు కేసీఆర్ వచ్చిన తర్వాత అభివృద్ధిపై గ్రామాల్లో ప్రజలు దీనిపై విస్తృతంగా చర్చ జరపాలని కోరారు.