నవీపేట, సెప్టెంబర్ 9: నాలుగు రోజులుగా పలు గ్రామాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని యంచ గుట్ట ప్రాంతంలో ఉన్న విఠలేశ్వర్ ఆలయం వద్ద బోనులో పడింది. మండలంలోని యంచ పంచాయతీ పరిధిలోని అల్జాపూర్ సమీపంలో ఉన్న గుట్ట ప్రాంతాల్లో చిరుత సంచారంపై స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు పాదముద్రలను సేకరించి బోను ఏర్పాటుచేశారు. చిరు త ఆ ప్రాంతం నుంచి యంచ గుట్ట ప్రాంతంలోని విఠేలేశ్వర్ ఆలయం వైపు వెళ్లిందన్న గ్రామస్థుల సూచన మేరకు శుక్రవారం రాత్రి ఆలయ సమీపంలోని ఘాట్రోడ్డు వద్ద మరో బోను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం యంచ గ్రామ సర్పంచ్ లహరి ప్రవీణ్తోపాటు యువకులు బోను వద్దకు వచ్చి చూడగా అందులో చిరుత కనిపించడంతో వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఈ చిరుతను హైదరాబాద్లోని జూ పార్కుకు తరలించినట్టు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పద్మారావు తెలిపారు.