జగిత్యాల, మే 21 (నమస్తే తెలంగాణ): తప్పుడు హామీలతో ప్రజలను బీజేపీ మభ్యపెడుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. మోదీ హై తో ముష్కిల్ హై.. దేశ జీడీపీ పాతాళ్ మే హై.. బే రోజ్గార్ ఆస్మాన్ మే హై (మోదీ ఉంటే కష్టమే.. పాతాళంలోకి వెళ్లిన దేశ జీడీపీ.. ఆకాశానికి చేరిన నిరుద్యోగ రేటు) అని ఆరోపించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ స్థాయి విస్తృతస్థాయి సమావేశాన్ని మెట్పల్లిలోని వెంకట్రెడ్డి గార్డెన్స్లో శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ.. 75 ఏండ్ల భారత దేశ రూపాయి విలువ అంతర్జాతీయ విపణిలో ఈ స్థాయికి ఎన్నడూ దిగజారలేదని, ఇది అత్యంత ప్రమాదకరమని అన్నారు. బీజేపీ ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ ఎక్కడా కనిపించటం లేదని మండిపడ్డారు. అబద్ధాలకు ప్రతిరూపమైన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అమెరికాలో కూడా అబద్ధాలు ఆడుతున్నాడని, పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మూడేండ్లుగా రైతులకు ముఖం చాటేశాడని ఫైర్ అయ్యారు. రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్వన్గా మార్చిన కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్నదని, ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
బీజేపీ, కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను టీఆర్ఎస్ నేతలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొన్నారని ఆరోపించారు. అందుకే ఆ పార్టీని విమర్శించటం లేదని అన్నారు. మతం పేరిట, దేవుడి పేరిట బీజేపీ రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. ‘వారు జై శ్రీరామ్ అంటే మనం జై హనుమాన్ అని బదులిద్దాం. భగవంతుడి కంటే భక్తుడే గొప్ప అన్న విషయాన్ని మరిచిపోవద్దు. అవసరమైతే దేవుడిని కూడా ప్రజలు ప్రశ్నిస్తారు. భద్రాచలంలో గుడికట్టిన రామదాసును ఖైదు చేస్తే, రాముడినే ప్రశ్నించారు. అలాంటి వారసత్వం తెలంగాణ ప్రజలది.
భక్తిని బజార్లో పెట్టి రాజకీయం చేసే పద్ధతి ఇక నడవదన్న విషయం బీజేపీకి తెలియజేయాలి’ అని అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఒక్కసారి కూడా ఢిల్లీ స్థాయిలో ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. 95 శాతం స్థానిక కోటాతో కొత్తగా రూపుదిద్దుకొన్న జోన్లతో స్థానిక యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభించబోతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో 32 వేల కుటుంబాలకు దళితబంధు వర్తింపజేశామని, ఈ ఆర్థిక సంవత్సరం మరో 3 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. అనంతరం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మామిడి మార్కెట్ యార్డులో నిర్వహించిన కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మల్యాల, మే 21: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధిపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించిందని కవిత తెలిపారు. ఆంజనేయ స్వామి, భేతాళ స్వామి ఆలయాల్లో పూజలు చేసిన ఆమె.. ఆలయ ప్రాకార మండపంలో అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 108 సార్ల హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అంజన్న ఆలయ మహాత్యం గొప్పదని, రాష్ట్ర సర్కారు ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపిస్తున్నదని అన్నారు.