హైదరాబాద్ : కుల, మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మియాపూర్లో కల్వరి టెంపుల్ హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తక్కువ ఖర్చుతో పేదలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేలా హాస్పిటల్ను ఏర్పాటు చేసిన డాక్టర్ సతీశ్కుమార్ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు.
కొవిడ్ సమయంలో 200 పడకల కేర్ సెంటర్ ఏర్పాటు చేసిన కల్వరీ టెంపుల్ సేవలను గుర్తించిన తెలంగాణ వైద్యశాఖ.. శాశ్వతంగా 200 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చిందని చెప్పారు. పేదవాడికి గౌరవంతో కూడిన వైద్యం అందించే ప్రయత్నం చేసిన కల్వరీ టెంపుల్ నిర్వాహకులను అభినందించి, వారి ప్రయత్నానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
కల్వరీ టెంపుల్లో స్వచ్ఛందంగా పనిచేస్తున్న వైద్య సిబ్బందికి సైతం ఎమ్మెల్సీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, కల్వరీ టెంపుల్ నిర్వాహకులు పాల్గొన్నారు.