యాదాద్రి, జూన్18: యాదాద్రి పంచనారసింహుడికి నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. ఉదయం మూడున్నర గంటలకు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పారు. తిరువారాధన, బాలభోగం, నిజాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు తులసీ సహస్రనామార్చనలు, ఆంజనేయుడికి సహస్రనామార్చన చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన,స్వామివారికి, ఆంజనేయస్వామి వారికి సహస్రనామార్చన, వెండిమొక్కు జోడు సేవలను వైభవంగా జరిపారు. కొండకింద దీక్షాపరుల మండపంలో సత్యనారాయణ వ్రతాలు వైభవంగా సాగాయి. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా జరిగాయి. 22 వేల మంది స్వామివారిని దర్శించుకోగా, రూ.25.34 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు.
దాతల సహకారంతో తయారుచేయించిన బంగారు వర్ణపు సింహాసనం శనివారం ఆలయానికి చేరుకొన్నది. ఈ సింహాసనంపై స్వామివారి ఉత్సవ విగ్రహాలను అధిష్ఠింపజేసి నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.