యాదాద్రి, సెప్టెంబర్ 30: స్వయం భూ పంచనారసింహుడిగా కొలువైన యాదగిరీశుడికి నిత్యోత్సవాలను అత్యంత వైభవంగా జరిపించారు. శుక్రవారం తెల్లవారుజామునే స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ, తిరువారాధన, నిజాభిషేకం నిర్వహించారు. ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి సేవ కార్యక్రమాన్ని చేపట్టారు.
అనంతరం నిత్య తిరుకల్యాణోత్సవాన్ని జరిపించారు. సాయంత్రం స్వామివారి వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ, తిరువారాధనను వైభవంగా నిర్వహించారు. స్వయంభూ నారసింహుడికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. స్వామివారిని 6,324 మంది భక్తులు దర్శించుకోగా, ఖజానాకు రూ.10,61,130 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.