హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): కరోనా విలయతాండవం చేస్తుండడం, పెరుగుతున్న రోగులకనుగుణంగా ఆక్సిజన్ లభ్యత లేకపోవడంతో ప్రభుత్వం సుదూర ప్రాంతాల నుంచి ప్రాణవాయువును తెప్పిస్తున్నది. ఆక్సిజన్ కొరతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని కొన్ని బల్క్డ్రగ్ పరిశ్రమలు ఆక్సిజన్ను ఉత్పత్తి చేసేందుకు ముందుకొచ్చాయి. సాధారణంగా ఫార్మా, బల్క్డ్రగ్ పరిశ్రమల్లో నైట్రోజన్ ఉత్పత్తి కేంద్రాలుంటాయి. నైట్రోజన్ను ఉత్పత్తి చేసే యూనిట్లలో స్వల్పమార్పులు చేపట్టి కొన్ని పరికరాలు అమర్చితే .. నైట్రోజన్ యూనిట్ల నుంచి ఆక్సిజన్ను కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఈ క్రమంలో రాష్ట్రంలోని కొన్ని పరిశ్రమలు ఆక్సిజన్ ఉత్పత్తి చేసేందుకు ముందుకు వస్తున్నాయి.
కరోనా రెండోదశ తీవ్రరూపం దాల్చుతుండడంతో దేశమంతట ప్రాణవాయువు కొరత వేధిస్తున్నది. దీన్ని తీర్చేందుకు పలు పరిశ్రమలు తమ నైట్రోజన్ ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసేందుకు సిద్ధమని సుమారు ఐదు ఫార్మా,బల్క్డ్రగ్ పరిశ్రమలు ముందుకు వచ్చాయి. ఇందులో హెటిరో, చైతన్య క్లోరైడ్స్, ఎన్ఎస్ఎన్ వంటి పరిశ్రమలున్నాయని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు పేర్కొంటున్నారు. నైట్రోజన్ యూనిట్లను ఆక్సిజన్ యూనిట్లుగా మార్చేందుకు అవసరమైన పరికరాలు జర్మనీ నుంచి రావాల్సి ఉన్నందని, ఇవి రావడానికి సుమారు 20 నుంచి 25 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొత్తగా ఆక్సిజన్ యూనిట్ ఏర్పాటు చేయాలంటే సుమారు 100 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుందని, ప్రస్తుత అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని ఫార్మా, బల్క్డ్రగ్ పరిశ్రమలు ముందుకు రావాలని పీసీబీ అధికారులు కోరుతున్నారు.
నైట్రోజన్ ప్లాంట్లను ఆక్సిజన్ ప్లాంట్లుగా మార్చేందుకు నిబంధనలను సీపీసీబీ సడలించిందని పీసీబీ అధికారులు అంటున్నారు. పీసీబీ అధికారులకు సమాచారం ఇస్తే సరిపోతుందని, పెద్దగా అనుమతులు పొందాల్సిన అవసరం లేదని తెలిపారు. పరికరాలు వచ్చి మార్పులు చేపడితే ఆక్సిజన్ కొరత చాలావరకు తీరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరికరాలు పూర్తిస్థాయిలో ఎప్పటివరకు అందుబాటులోకి వస్తాయి ? వీటి నుంచి ఎంత ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది ? అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.