సీఎం కేసీఆర్ మీడియా సమావేశం మొదలుపెట్టింది శనివారం సాయంత్రం 4 గంటలకు. గంటా 24 నిమిషాలసేపు మాట్లాడిన ఆయన.. కేంద్రం, నీతి ఆయోగ్ పనితీరును కడిగి పారేశారు. 5.24కు సీఎం ప్రసంగం ముగిస్తే, గంటన్నరైనా గడువకముందే కేంద్రం స్పందించింది. సరిగ్గా 6.48కి నీతి ఆయోగ్ తన వివరణను విడుదల చేసింది. కేసీఆర్ లేవనెత్తిన అంశాలు ఎంత సూటిగా దేశవ్యాప్తంగా జనంలోకి వెళ్తున్నాయో చెప్పటానికి కేంద్ర సర్కారు బెదురుపాటు, తత్తరపాటు స్పందనే ప్రత్యక్ష నిదర్శనం. ఒక ముఖ్యమంత్రి ప్రశ్నలకు మోదీ సర్కారు ఇంత త్వరగా స్పందించటం ఎనిమిదేండ్ల పాలనా చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు.
రైతులు 13 నెలలు పోరాటం చేసినా, అగ్నివీరులు అగ్గి రాజేసినా, మేధావులు నిలదీసినా కేంద్ర సర్కారు ఏనాడూ స్పందించలేదు. ఎనిమిదేండ్లలో ఒక్క మీడియా సమావేశమూ నిర్వహించని ఏకైక ప్రధాని మోదీ అని ఢిల్లీ జర్నలిస్టులు చెప్తుంటారు. అంతెందుకు.. హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు కేంద్రం తీరుపై కేసీఆర్ అనేక ప్రశ్నలు వేస్తే, మోదీగానీ.. బీజేపీ నేతలుగానీ కనీసం మాట్లాడలేదు. కానీ, మౌనంలో వైఫల్యాలను ఎంతోకాలం దాచలేరు. జవాబు చెప్పను అన్నంతమాత్రాన ప్రశ్నలు అణగిపోవు. ఇది ప్రజాస్వామ్యం.. ఎంతగొప్ప నాయకుడైనా ప్రజలకు జవాబు చెప్పాల్సిందే.. జవాబుదారీగా ఉండాల్సిందే. కేసీఆర్ వాదనకు నీతిఆయోగ్ గంటన్నరలోనే ఇచ్చిన స్పందన& అది అరకొర, అబద్ధాల సమాహారమే అయినప్పటికీ.. దీనినే రుజువు చేస్తున్నది.