యాదాద్రి, సెప్టెంబర్ 19: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారికి అర్చకులు దర్బార్ సేవను ఆగమశాస్త్రరీతిలో జరిపారు. సోమవారం ప్రధానాలయ ముఖమండపంలో దర్బార్ సేవలో భాగంగా నాలుగు వేదాలు పారాయణం చేసి, స్వస్తి మంత్రార్థ మంత్రాలతో స్వామివారిని శాంతింపజేశారు. ఉత్సవమూర్తులకు తిరువీధి సేవలను వైభవంగా నిర్వహించారు.స్వామివారిని గరుడ వాహనసేవ, అమ్మవారిని తిరుచ్చి సేవపై ప్రధానాలయంలోని ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం సాయంకాలపు ఆరాధన, స్వామివారికి సహస్ర నామార్చన, ఆమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు జరిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారి దర్శనాలు సాగాయి. స్వామివారిని 12,822 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి ఖజానాకు రూ.16,83,318 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారి సేవలో నీతి ఆయోగ్ సభ్యులు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారిని నీతి ఆయోగ్ డిప్యూటీ అడ్వైజర్ డాక్టర్ బిశ్వనాథ్ బిషోయ్ దర్శించుకున్నారు. ఆయన వెంట నీతి ఆయోగ్ సభ్యులు కూడా ఉన్నారు. ఆలయ ప్రధాన అర్చక బృందం వారికి ఆలయ సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు.