Lucky Draw | హైదరాబాద్ సిటీబ్యూరో/ఖైరతాబాద్/అమీర్పేట్, అక్టోబర్ 20 ( నమస్తే తెలంగాణ ): నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహించిన దసరా షాపింగ్ బొనాంజా బంపర్ డ్రాలో లాల్దర్వాజకు చెందిన నీల్ గోగ్టే ఇంజినీరింగ్ కాలేజీ డైరెక్టర్ పీఎస్ మూర్తి విజేతగా నిలిచారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన దసరా షాపింగ్ బొనాంజా కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్ లక్కీ డ్రా తీశారు. ఇందులో పీఎస్ మూర్తిని నిస్సాన్ మాగ్నెట్ కారు వరించింది.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ పాఠకులతో అనుబంధాన్ని మరింత ధృడపరుచుకోవాలనే నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఆశయం ఎంతో గొప్పదని అన్నారు. తెలంగాణ గొంతుకగా నిలిచిన ఈ రెండు దినపత్రికలను ప్రతి ఒక్కరూ ఇంటి పత్రికలుగా భావిస్తారని చెప్పారు. బతుకమ్మ, నవరాత్రులతో ఇప్పటికే పండుగ వాతావరణం ఉంటే దానికి తోడు దసరా షాపింగ్ బొనాంజాతో నమస్తే తెలంగాణ మరింత ఉత్సాహభరితమైన వాతావరణాన్ని తీసుకొచ్చిందని ప్రశంసించారు.
షాపింగ్ చేసిన వారికి డిస్కౌంట్లు రావడం ఓకే కానీ.. కారు కూడా గిఫ్ట్గా ప్రదానం చేయాలని అనుకోవడం గొప్ప విషయమని చెప్పారు. కారు కొనుగోలు చేయడమే లక్ష్యంగా చాలా మంది ఉంటారని, ఇలాంటి కార్యక్రమాలతో వారి కల నెరవేరడం మంచి అనుభూతినిస్తుందని చెప్పారు.
పాఠకులతో అనుబంధాన్ని పెంచుకోవడంలో భాగంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు దసరా బొనాంజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గొప్ప విషయమని దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొన్నారు. చాలా మందికి విలువైన గిఫ్ట్లతో పాటు కారును బహుమతిగా ఇచ్చి వారిలో సంతోషానికి కారణమవుతున్న పత్రికల కృషి అభినందనీయమని అన్నారు. ‘నేను ఒక్కటే చెప్పగలను.. నమస్తే తెలంగాణ చాలా ఏండ్లు యాదుంటుంది’ అని పేర్కొన్నారు. తెలంగాణ సెక్రటేరియట్ చాలా గొప్పగా ఉందని కొనియాడారు. తాను నిర్మించిన భగవంత్ కేసరిలో చాలా సీన్లు సెక్రటేరియట్, ట్యాంక్బండ్ వద్ద షూట్ చేశామని తెలిపారు. ఆ సమయంలో అక్కడ జరిగిన అభివృద్ధి చూసి చాలా సంతోషానికి గురయ్యామని గుర్తు చేశారు. లక్కీ డ్రాలో గెలుపొందిన పీఎస్ మూర్తికి ఫోన్ చేసి, అభినందనలు తెలిపారు. ‘మీకు కారు గిఫ్ట్ వచ్చింది.. అభినందనలు.. ఈ సంతోష సందర్భంలో మీరు మా భగవంత్ కేసరి సినిమా చూడాలి’ అంటూ నవ్వులు పూయించారు. అక్కడున్న సభికులంతా చప్పట్లతో సందడి చేశారు.
‘బతుకమ్మ అంటే తెలంగాణకు ఒక పెద్ద వేడుక. పది రోజులపాటు బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు అంటూ ఓ కొత్త లోకంలో ఉంటాం. ఈ వేడుకను మరింత రంగులమయంగా చేయడంలో భాగంగా ఈ బొనాంజా స్కీంను తీసుకొచ్చాం. సమాజానికి తిరిగి ఇవ్వాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమం తీసుకున్నాం’ అని నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి పేర్కొన్నారు. ప్రతిసారి మా పేపర్ చందాదారులుగా చేరండి..మా పేపర్ బాగుందా? లేదా? అని మాత్రమే అడుగుతుంటామనీ.. కానీ పాఠకులతో మా అనుబంధం మరింతగా ధృడపడేలా ఈ కార్యక్రమం తీసుకున్నామని చెప్పారు. తాను ఒత్తిడిగా ఉన్న సమయంలో అనిల్ తీసిన ఎఫ్2 సినిమా చూస్తానని చెప్పారు. ‘అనిల్ మరో సినిమా రాజా ది గ్రేట్.. అయితే నేను అనిల్ ది గ్రేట్’ అని అంటానని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టుడే ఎడిటర్ కే శ్రీనివాస్రెడ్డి, ఏడీవీటీ జీఎం సురేందర్రావు, సీజీఎం(ఆపరేషన్స్) శ్రీనివాస్, సర్క్యులేషన్ జీఎం రాంరెడ్డి, కేఫ్ నిలోఫర్ అధినేత బాబురావు, ఏజీఎంలు రాములు, రాజిరెడ్డి, డీజీఎంలు ప్రవీణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దసరా షాపింగ్ బొనాంజాలో కారు గెల్చుకోవడం ఆనందంగా ఉన్నది. గురువారం చర్మాస్లో షాపింగ్ చేశాను. వివరాలను నింపి కూపన్ లక్కీ బాక్సులో వేశాను. విజేతగా నా పేరు వస్తుందని ఊహించలేదు. చాలా హ్యాపీగా ఫీలవుతున్నా. సత్యవతి రాథోడ్, అనిల్ రావిపూడి నాతో మాట్లాడి అభినందనలు చెప్పడం మంచి అనుభూతినిచ్చింది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలకు చాలా థ్యాంక్స్.
-పీఎస్ మూర్తి, బంపర్ బహుమతి విజేత