‘ఎగిలివారంగ, చిమ్మ చీకటి ఇంకా కమ్ముకుని ఉండగానే, వెలుగును ఊహించుకునే పక్షిలాంటిది నమ్మకం!’
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ఈ కవితా పంక్తితోనే మొదలుపెట్టారు. ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నప్పటికీ, ఆమె తనకు తెల్వకుండానే రెండు నిజాలను అంగీకరించారు.ఒకటి.. పదేండ్ల తర్వాత కూడా దేశం ఇంకా చీకట్లోనే ఉన్నదని! రెండు.. నిజాలకన్నా ‘నమ్మకాల’పైనే తాము ఆధారపడ్డామని!
వచ్చే ఆర్థిక సంవత్సరంతో మోదీ పరిపాలనకు 10 ఏండ్లు. ఈసారిదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్. పదేండ్ల మోదీ పరిపాలనలో చిమ్మచీకటే కమ్ముకున్నదని, నమ్మకాలతో మాయ చేస్తున్నారని నిర్మల బడ్జెట్ మరోసారి నిరూపించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మరో 16 లక్షల కోట్ల అప్పు తేనున్నది. దీంతో కలిపి పదేండ్లలో మోదీ చేసిన అప్పు 106 లక్షల కోట్లు! 65 ఏండ్లలో 14 మంది ప్రధానులు చేసిన మొత్తం అప్పు కేవలం 55 లక్షల కోట్లు, అంటే మోదీ ఒక్కడే దాదాపు రెండు రెట్ల అప్పు చేశారు.
ఈసారి దేశ బడ్జెట్ 45 లక్షల కోట్లు. విషాదం ఏమిటంటే ఇందులో నాలుగో వంతు అంటే,10 లక్షల కోట్లు వడ్డీలకే సరి. బడ్జెట్లో అన్ని రంగాలకన్నా మిత్తికి కేటాయించిన సొమ్మే ఎక్కువ! పదేండ్లకు ముందు ప్రతి పౌరుడిపై ఉన్న తలసరి అప్పు 40 వేల రూపాయలే. కానీ మోదీ తానొక్కడై మనందరిపై మోపిన తలసరి రుణభారం… అక్షరాలా లక్షా 16 వేలు.
ఇంతలా అప్పులు తేవడానికి కారణమేంటి?
భారతదేశ పౌరులుగా మనం పన్నులు కట్టడం లేదా?
– : పన్నులు పిండటం : –
నిర్మల స్వయంగా చెప్పినట్టు.. ప్రపంచంలో అత్యధికంగా ఆదాయ పన్ను (42.7 శాతం) చెల్లిస్తున్నది భారత పౌరులే! పదేండ్ల కిందట భారతీయులు చెల్లించిన మొత్తం పన్ను 8 లక్షల 16 వేల కోట్లు. మరి ఇప్పుడు? 23 లక్షల కోట్లు. అంటే మన నుంచి మోదీ మూడు రెట్లు ఎక్కువగా పన్నులు పిండుతున్నారు. ప్రత్యక్షం- పరోక్షం అన్నీ కలిపితే వచ్చే ఏడాది పన్నుల రూపేణా రాబోయే ఆదాయం 33.6 లక్షల కోట్లు. ఇది నిరుటి కంటే ఏకంగా పది లక్షల కోట్లు ఎక్కువ! దీనికి నిర్మల చెప్పిన భారత కథా వాక్యం ఏమిటంటే… ‘ధర్మాన్ని అనుసరించి రాజు తప్పనిసరిగా పన్నులు వసూలు చేయాలి’!
– : ఆస్తుల అమ్మకం : –
అక్కడితో ఆగుతున్నారా?అదీ లేదు. దేశాన్ని అమ్మకానికి పెట్టారు. ‘ఆత్మ నిర్భర అమృత కాల్’లో 75 ఏండ్లుగా దేశం కూడబెట్టుకున్న ఆస్తులన్నింటినీ తెగనమ్ముతున్నారు. ఈ పదేండ్లలో మోదీ సర్కారు చేసిన పెట్టుబడుల ఉపసంహరణ విలువ రూ. 4.55 లక్షల కోట్లు.
అప్పులు తెస్తున్నారు. పన్నులు పిండుతున్నారు.
ఆస్తులూ అమ్ముతున్నారు. మరి అవన్నీ ఏమవుతున్నట్టు?
ఈసారి బడ్జెట్నే తీసుకుందాం. దేశ గతిని మలుపు తిప్పే ఒక్క పెద్ద ప్రాజెక్టునైనా ప్రతిపాదించలేదు. ఉత్పత్తిని, ఉపాధిని పెంచే పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇచ్చే ఏర్పాటూ చేయలేదు. గొప్పగా చెప్పిన మేకిన్ ఇండియా ఏమైందో తెల్వదు. ధరలు తగ్గించే ఏర్పాటు లేదు. వ్యవసాయానికి పైసా లేదు. రైతుకు రూపాయి ఇవ్వలేదు. సంక్షేమాన్ని పట్టించుకోలేదు. యువతకు ఉద్యోగాల ఊసు లేదు. చివరికి ఉపాధి హామీ కూలీల పొట్టగొట్టే ఎత్తుగడ. ఆహార భద్రతపై ఆంక్షలు. సబ్సిడీల్లో కోత. మహిళల కోసం ఒక మహత్తర ప్రకటన లేదు. పాత- కొత్త ఆదాయ పన్ను స్కీం పేరుతో ఉద్యోగిని దొంగదెబ్బ తీశారు. ఎగుమతులు తగ్గుతున్నాయి. దిగుమతులు పెరుగుతున్నాయి. రూపాయి పాతాళానికి చూస్తున్నది. అంతా ‘మాటల ఆడంబరం- మోసాల డంబాచారం’! చివరికి ‘ఈ ప్రభుత్వం ఎలాగూ ఏమీ చేయదు. నేను చచ్చిపోతే నా కుటుంబం ఏమవుతుందో’ అని మధ్యతరగతి మనిషి బీమా చేసుకుంటే, తద్వారా వచ్చే మొత్తంపైనా పన్ను వేసిన దుర్మార్గ పన్నాగం.‘పేదోళ్లపై పన్ను పెంచు… సంపన్నులకు పంచు’ ఇదీ సిద్ధాంతం.
అప్పుల మాట బయటపడగానే షేర్ మార్కెట్ కుప్ప కూలింది.
చెప్పడానికి ఏమీ లేక నిర్మల సగం సమయంతోనే తప్పించుకున్నారు.
భారత్ అప్పు (కోట్ల రూపాయలలో)
31-3-2014 నాటికి (వాస్తవంగా) : 55,87,149.33
31-3-2023 నాటికి (సవరించిన అంచనా) : 1,52,61,122.12
31-3-2024 నాటికి (బడ్జెట్ అంచనా) : 1,69,46,666.85
వడ్డీ చెల్లింపులు (కోట్ల రూపాయలలో)
2013-14 (వాస్తవంగా) : 3,95,200
2023-24 (బడ్జెట్ అంచనా) : 10,79,971
ప్రతి నెలా చెల్లించాల్సిన వడ్డీ : 90,000 కోట్లు
పన్ను వసూళ్లు (కోట్ల రూపాయలలో)
2013-14 (వాస్తవంగా) : 11,58,906
2022-23 (సవరించిన అంచనా) : 30,44,257
2023-24 (బడ్జెట్ అంచనా) : 33,60,860
డాలరుకు రూపాయి మారకం
26-05-2014 (మోదీ వచ్చే నాటికి) : 58.60
01-02-2023 నాటికి (ప్రధానిగా మోదీ) : 81.80
మరో రూ.15.4 లక్షల కోట్లు అప్పు చేయనున్న కేంద్రం
ప్రతి భారత పౌరుడి తలపై 1.16 లక్షల రుణ భారం
జీడీపీ వృద్ధిరేటు 6.5% ..అప్పుల్లో వృద్ధిరేటు 8 శాతం
పాత వాహనాలను మార్చేసే పథకంపై ప్రకటన సమయంలో నిర్మల, ‘రిప్లేసింగ్ ఓల్డ్ పొల్యూటింగ్ వెహికిల్స్ అనబోయి రిప్లేసింగ్ ఓల్డ్ పొలిటికల్’ అన్నారు.
ఈసారి కూడా ఆమె ఎంతమాత్రం తప్పు మాట్లాడలేదు!
‘ఓల్డ్ పొలిటికల్ వెహికిల్’గా మారిన మోదీ బీజేపీని గద్దెదించి తుక్కు కింద జమకట్టే సమయం ఆసన్నమైంది!
బడ్జెట్ ప్రసంగంలో నిర్మల చెప్పిన చాణక్యనీతి వాక్యం అదే చెప్తున్నది. ‘కార్యం పురుషకారేణ, లక్ష్యం సంపద్యతే’… మానవ ప్రయత్నం గట్టిగా ఉంటే, లక్ష్యం తప్పక సిద్ధిస్తుంది!!
తథాస్తు!!