Minister KTR | హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణను దయ్యాల పాలు చెయ్యొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఎవరిచేతుల్లో భద్రంగా, సురక్షితంగా ఉంటుందో ఆలోచించాలని కోరారు. సోమవారం తెలంగాణభవన్లో కేటీఆర్ సమక్షంలో ప్రముఖ గాయకుడు, కళాకారుడు దరువు ఎల్లన్న, నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి వేర్వేరుగా బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణను తన్నుకు పోయేందుకు, రాష్ట్ర సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ గద్దల్లా కాచుకు కూర్చున్నాయని విమర్శించారు. మూడు గంటల కరెంట్ చాలని రేవంత్రెడ్డి, రైతుబంధు దండగని ఉత్తమ్కుమార్రెడ్డి చెప్తున్నారని ఇదీ కాంగ్రెస్ పార్టీ విధానమని మండిపడ్డారు. మనుషులు కలిసి ఉండొద్దని, కుల మతాల పేరుతో కొట్టుకు చావాలని బండి సంజయ్ చెప్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓట్లు అనగానే ఆగమాగం కావొద్దని, తెలంగాణకు ఏది మంచో, ఏది చెడో ఆలోచించి ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ ఉండగా.. సన్నాసులు మనకెందుకు?
తెలంగాణను కంటికి రెప్పలా కాపాడే సీఎం ఉండగా సన్నాసులు మనకెందుకని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ నాయత్వంలోనే తెలంగాణకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని స్పష్టంచేశారు. గులాబీ జెండా.. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు న్యాయం చేస్తుందని ఉద్యమకారులు తిరిగి వస్తున్న అద్భుత సందర్భ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలని ఆకాంక్షించారు. మేడిగడ్డ (లక్ష్మి)బరాజ్లో రెండు పిల్లర్లు కుంగితే కాళేశ్వరం పనైపోయిందని, లక్ష కోట్లు కమీషన్లు తిన్నారని కొంతమంది వాగుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ బరాజ్ నిర్మించిన తరువాత ఐదుసార్లు వరదలు వచ్చాయని వాటన్నింటిని తట్టుకున్నదని, పిల్లర్ల కుంగుబాటుపై ఇంజినీర్లు అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం మీద, ప్రజల మీద పైసా భారం పడకుండా నిర్మాణ సంస్థ త్వరలోనే పునరుద్ధరిస్తుందని తెలిపారు.
యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్
ఉద్యోగాల భర్తీ ప్రక్రియ విషయంలో టీఎస్ఎస్సీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నదని, ఈ బాధ్యత తమ మీదనే ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి, ఖాళీ అయ్యే పోస్టులను భర్తీ చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. యూనివర్సిటీల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుతామని, వాటినీ వ్యక్తిగతంగా తానే పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు.
దరువు ఎల్లన్న, రమాదేవికి సముచిత స్థానం
తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేసిన దరువు ఎల్లన్నకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. దరువు ఎల్లన్న గొంతును, శక్తిని వృథాపోనివ్వకుండా సేవలు వినియోగిస్తామని చెప్పారు. బీజేపీ తడిగుడ్డతో రమాదేవి గొంతు కోసిందని, రమాదేవికి సముచిత స్థానం కల్పిస్తామని, ఆమెను నమ్ముకుని వచ్చినవారికి స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే ఆభ్యర్థి విఠల్రెడ్డి, ఇన్చార్జి పురాణం సతీశ్, పార్టీ నాయకులు చెరుకు సుధాకర్, గెల్లు శ్రీనివాస్, మేడె రాజీవ్సాగర్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, మిట్టపెల్లి సురేందర్, తుంగబాలు, జిందం చక్రపాణి, నర్సింగరావు తదిరులు పాల్గొన్నారు.
బీజేపీ ముక్త్ తెలంగాణ
ఒకప్పటి బీజేపీకి ఇప్పటి బీజేపీ చాలా తేడా ఉన్నదని రమాదేవి చెప్పారు. దేశంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలని బీజేపీ కోరుకుంటుంటే.. బీజేపీ ముక్త్ తెలంగాణ కావాలని రాష్ట్రంలోని ప్రజలు కోరుకొంటున్నారని,. దీనినిబట్టే బీజేపీ ఎంత కమర్షియల్గా తయారైందో అర్థమవుతున్నదని చెప్పారు. ముథోల్లో రెండుసార్లు ద్వితీయ స్థానంలో నిలిచిన తనను కాదని, మూడో స్థానానికి పరిమితిమైన వ్యక్తికి టికెట్ అమ్ముకున్నారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు అమలు చేసే చిత్తశుద్ధి బీజేపీకి లేదని దుయ్యబట్టారు. దేశంలో నమ్మినోళ్ల కోసం, ఇచ్చిన మాటకోసం నిలబడే మగాడు కేసీఆర్ మాత్రమేనని స్పష్టంచేశారు. ముథోల్లో విఠల్రెడ్డిని గెలిపిస్తామని చెప్పారు.
హింసా రాజకీయాలు మనకొద్దు
‘కొత్త ప్రభాకర్రెడ్డిపై ఎవడో కత్తి పట్టుకుని దాడి చేసిండు. తెలంగాణలో గతంలో ఎన్నడూ హింసలేదు. ఆ పొడిచినోడు కాంగ్రెస్ కార్యకర్త అంటున్నరు. ఇట్లాంటి దిక్కుమాలిన పనులు మనకు అలవాటు లేవు. హింసా రాజకీయాలు మంచిది కాదు. ఒకవైళ హింసనే సమాధానం అనుకుంటే.. ఆ సత్తా మనకు ఉంది. కానీ.. అది మన పంథా కాదు. మన వైఖరి కాదు’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
దేశంలో కేసీఆర్దే కీరోల్
తెలంగాణలో మళ్లీ సీఎం కేసీఆర్ను గెలిపించాలని, తర్వాత మహారాష్ట్రలోనూ గులాబీ జెండానే ఎగురుతుందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్రలో కలిపి 35 నుంచి 40 ఎంపీ స్థానాలను బీఆర్ఎస్ గెలిస్తే ఢిల్లీలో చక్రం తిప్పేది మనమేనని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ కింద ఇప్పటికే రూ.13,600 కోట్లు చెల్లించామని, మరో రూ.మూడువేల కోట్లు వారం రోజుల్లో చెల్లిస్తామని తెలిపారు. వడ్డీ గురించి కూడా ఆలోచించాలని చాలామంది కోరుతున్నారని, ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
కేసీఆర్ను వద్దనడానికి ఒక్క కారణం ఉన్నదా?
తెలంగాణ సాధించిన, అన్నింట్లో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ను వద్దనడానికి ఒక్క కారణమైనా ఉన్నదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. 55 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, తొమ్మిదిన్నర ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేశాయో చెప్పే దమ్ముందా? అని నిలదీశారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ కేసీఆర్ బీమా రాబోతున్నదని అందరూ ధీమాతో ఉండొచ్చని తెలిపారు. ఎన్నికల వేళ మళ్లీ ముథోల్, బైంసా వంటి ప్రదేశాల్లో కుల, మత పంచాయితీలు పెట్టేందుకు కొందరు వస్తారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సన్నాసులను దూరం పెట్టాలని, మంచి చేసే కేసీఆర్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.