Niranjan Reddy | కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్లో కుంగింది మూడు పిల్లర్లు మాత్రమే అని, వాటిని సరిచేసి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. వ్యవసాయాన్ని రాజకీయాలతో ముడిపెట్టి.. రైతుల పొలాలను ఎండబెట్టొద్దు.. రైతాంగం ఉసురు పోసుకోవద్దు అని నిరంజన్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ బరాజ్ సందర్శన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
మేడిగడ్డ బరాజ్ విషయంలో తప్పులు జరిగి ఉంటే ఉన్నతస్థాయి విచారణ జరిపి శిక్షలు పడేలా చూడాలి. కానీ రైతుల పొలాలను ఎండబెట్టకూడదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక బరాజ్ మాత్రమే. ఇది కాకుండా సుందిళ్ల, అన్నారం బరాజ్లు, పంప్ హౌస్లు, అండర్ గ్రౌండ్ టన్నెళ్లు, రిజర్వాయర్లు, ఓపెన్ కెనాళ్లతో 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సిస్టమ్ అభివృద్ది చేసి ఉన్నదని తెలిపారు. వీటన్నింటినీ పక్కకు పెట్టి కుంగిన మూడు పిల్లర్లను చూపి ఇదే మొత్తం ప్రాజెక్ట్ అని దుర్భుద్దితో దుష్ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మేడిగడ్డను సరిచేయాలి. లేకుంటే గడపగడపకూ వెళ్లి రైతులను చైతన్యం చేస్తాం.. ఇంటికో వంద మందిని జమచేసి ఇంజనీర్ల సహకారంతో రైతులతోనే దీనిని రిపేర్ చేయించుకుంటాం. రాజకీయాన్ని, వ్యవసాయాన్ని కాంగ్రెస్ కలిపి చూడొద్దు.. ఏ ప్రభుత్వమైనా రైతుల కడగండ్లు తీర్చాలన్నారు. రైతుబంధు ఇవ్వకున్నా అప్పుచేసి సాగు చేశారు. ఇప్పుడు ఆ పంటలు ఎండిపోవడంతో రైతులు అవస్థపడుతున్నారు అని నిరంజన్ రెడ్డి తెలిపారు.
నీటి లభ్యత కోసమే మేడిగడ్డ బరాజ్ను నిర్మించామని తెలిపారు. తుమ్మిడిహట్టిని వదిలిపెట్టింది అందుకే. ప్రాజెక్టు అంతిమలక్ష్యం రైతులకు సాగునీరు అందించడమే. 2007లో తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. నాడు కేంద్రంలో, రాష్ట్రంలో, పక్కన ఉన్న మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. కానీ నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను మహారాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ తిరస్కరించిందని గుర్తు చేశారు. 2007 నుండి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అనుమతి తీసుకోలేదు. అప్పుడు మంత్రిగా ఉన్న ఉత్తమ్ ఇప్పుడు కేసీఆర్ తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సి ఉండె అని మాట్లాడడం అత్యంత చెత్తగా, జుగుప్సాకరంగా ఉందని ధ్వజమెత్తారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అటు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు కేంద్రాన్ని ఒప్పించి.. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రయోజనాలతో పాటు రైతులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని తెలిపారు. కాంగ్రెస్ మాదిరిగా ప్రాజెక్టుల నిర్మాణం దశాబ్దాల పాటు సాగదీయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని జీర్ణించుకోలేక లేని అభాండాలని వేసి రాజకీయ లబ్ది కొరకు సత్య దూరం మాటలు మాట్లాడటం సిగ్గు చేటు అని మండిపడ్డారు. అనవసర పంతాలకు పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రయత్నం చేస్తుంది అని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.
కేసీఆర్ పాలనలో రైతులకు సకాలంలో నీళ్లు ఇచ్చారు. 24 గంటల ఉచిత కరెంట్ అందించారు. పంట పెట్టుబడి కూడా సాయం చేశారు. పండిన పంటను కొనుగోలు చేసి రైతుల ముఖాల్లో కేసీఆర్ సంతోషం చూశారని నిరంజన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ రైతులకు కరెంట్ కటకట, నీటికి కటకట, రైతుబంధుకు కటకట ఏర్పడింది. మూడెకరాల వరకు రైతుబంధు ఇచ్చేందుకు మూడు నెలల సమయం తీసుకున్నారు. కాంగ్రెస్ వచ్చాక ఏర్పడిన దుర్భర పరిస్థితులను రాష్ట్ర ప్రజలు గమనించాలి అని నిరంజన్ రెడ్డి సూచించారు.