హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ నిర్వాకంతో ఆయిల్పామ్ విత్తనాలకు ‘దిగుమతి’ కష్టాలు ఎదురవుతున్నాయి. విచక్షణారహితంగా దిగుమతి సుంకాన్ని (కస్టమ్స్ డ్యూటీని) పెంచడమే ఇందుకు కారణం. ఓవైపు దేశవ్యాప్తంగా ఆయిల్పామ్ సాగును భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు ఈ విత్తనాలపై దిగుమతిపై పన్నును ఏకంగా 5 నుంచి 30 శాతానికి పెంచింది. ఇది దిగుమతిదారులపై, ముఖ్యంగా తెలంగాణపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ను సాగుచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా 40 లక్షల విత్తనాల దిగుమతికి ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్ ఇటీవల మలేషియా, కోస్టారికా, థాయ్లాండ్ దేశాలకు ఇండెంట్ పెట్టింది. గతంలో లక్ష విత్తనాల కొనుగోలుకు రూ.3.25 లక్షల దిగుమతి సుంకం చెల్లించాల్సి వచ్చేది. కేంద్ర ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పుడు అదే లక్ష విత్తనాలకు ఏకంగా రూ. 22.75 లక్షలు చెల్లించాలి. ఈ విధంగా 40 లక్షల విత్తనాలకు ఏకంగా రూ.8 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దిగుమతి సుంకం భారీగా పెరగడంతో ఆయిల్పామ్ విత్తనాల కొనుగోలుకు కంపెనీలు వెనుకంజ వేస్తున్నాయి. దీనికితోడు మలేషియా, కోస్టారికా, థాయ్లాండ్లో ఆయిల్పామ్ విత్తనాలకు కొరత ఏర్పడటంతోపాటు వివిధ దేశాల నుంచి డిమాండ్ అధికమైంది. దీంతో ఆయా దేశాల్లోని కంపెనీలు గతంలో మాదిరిగా విత్తనాలను సరఫరా చేయలేకపోతున్నాయి. ఇది మన దేశంలో, ప్రత్యేకించి తెలంగాణలో ఆయిల్పామ్ సాగును తీవ్రంగా దెబ్బతీయనున్నది. రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల క్రితం 40 లక్షల విత్తనాలకు ఇండెంట్ పెడితే.. ఇప్పటి వరకు కేవలం 10 లక్షల విత్తనాలే వచ్చాయి.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 37.5 నుంచి 27.5 శాతానికి కుదించింది. దీంతో విదేశాల నుంచి ముడి పామాయిల్ భారీగా దిగుమతి అవుతున్నది. ఇది దేశీయ మార్కెట్పై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతుందని, ధరలు తగ్గి స్థానిక రైతులు నష్టపోతారని ఆయిల్ ఫెడ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆయిల్పామ్ విత్తనాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీని వెంటనే తగ్గించాలి. గతంలో మాదిరిగా 5 శాతానికే పరిమితం చేయాలి. లేదంటే దేశంలో, రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగుకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీన్ని వివరిస్తూ త్వరలో కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, పీయూష్ గోయాల్ను కలిసి వినతిపత్రం సమర్పిస్తాం.
–కంచర్ల రామకృష్ణారెడ్డి, ఆయిల్ఫెడ్ చైర్మన్
ఆయిల్పామ్ విత్తనాలపై భారీగా పెంచిన దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి కేంద్రాన్ని డిమాండ్చేశారు. ఇదే అంశంపై మంగళవారం ఆయన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. ఐదు శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 30 శాతానికి పెంచడం దారుణమని పేర్కొన్నారు. దీనివల్ల రైతులపై పెనుభారం పడుతుందని, అది ఆయిల్పామ్ సాగుపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. వంటనూనెల డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం భారీగా పెరిగి, వినియోగదారులపైగా భారం పడుతుందని వివరించారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం 8 లక్షల ఎకరాల సాగుకు 14.40 కోట్ల విత్తనాలు అవసరమని, వీటి దిగుమతికి రూ.వందల కోట్లు సుంకంగా చెల్లించాల్సి ఉంటుందని ఆందోళన తెలిపారు.