Heart Attack | ముస్తాబాద్: వయసు పైబడిన తర్వాత వచ్చే గుండె జబ్బులు.. ఇప్పుడు చిన్న పిల్లలను బలితీసుకుంటున్నాయి. తాజాగా ఓ డిగ్రీ విద్యార్థి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన ఓరి రాజు-లత దంపతులకు ఇద్దరు కొడుకులు. వారిలో పెద్ద కొడుకు సిద్దిపేటలో ఇంజనీరింగ్ చేస్తుండగా.. చిన్న కొడుకు చందు (19) హైదరాబాద్లోని ఓ డిగ్రీ కాలేజీలో బీకాం చదువుతున్నాడు. అక్కడే ఓ హాస్టల్లో ఉంటున్నాడు. అయితే చందుకు జ్వరం రావడంతో మంగళవారమే హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున బాత్రూమ్కి వెళ్లిన చందూ.. గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చందూ హఠాన్మరణంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. అందరితో చలాకీగా ఉండే తమ కొడుకు ఆకస్మికంగా మరణించడంతో గుండెలు పగిలేలా రోదించారు.