హైదరాబాద్/ సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ను తలదన్నేలా వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ దవాఖాన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కిడ్నీ రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నది. తక్కువ సమయంలో ఎక్కువ మందికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తూ దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తున్నది. రోగులకు నిరీక్షణ కాలాన్ని తగ్గించడమే కాకుండా ప్రాణపాయ స్థితికి చేరిన రోగులకు పునర్జన్మ ప్రసాదిస్తున్నారు నిమ్స్ యూరాలజీ విభాగం వైద్యులు. గడిచిన నాలుగు నెలల్లో 50 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి ఉచితంగా నిర్వహించి మరో రికార్డు సృష్టించారు.
సగటున రెండు రోజులకో కిడ్నీ మార్పిడి జరిగిందన్నమాట.నిమ్స్లో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు 1989లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు 24 ఏండ్లలో 600 పైచిలుకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గత తొమ్మిదేండ్లలో 862 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడం విశేషం. ఇందులో 522 లైవ్ ట్రాన్స్ప్లాంట్స్ కాగా 340 కాడవర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి సగటున 20 నుంచి 30 మాత్రమే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయగా స్వరాష్ట్రంలో ఏడాదికి సగటున 100 కిడ్నీ మార్పిడులు చేస్తుండటం విశేషం.
ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 4 నెలల్లో 50 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడం తాజా రికార్డు. వీటిలో 28 లైవ్, 22 క్యాడవర్ ట్రాన్స్ప్లాంట్స్. దేశంలోని అహ్మదాబాద్, వేలూరు వంటి ఒకటి రెండు ఇన్స్టిట్యూట్లలో తప్ప మరెక్కడా ఈ స్థాయిలో కిడ్నీ మార్పిడులు చేయడం లేదు.
సాధారణంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది. నిమ్స్లో ఆరోగ్యశ్రీ ద్వారా నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా నిర్వహిస్తుండటం విశేషం. గత నాలుగు నెలల్లో చేసిన 50 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలను సైతం ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా నిర్వహించారు.
నిమ్స్ దవాఖానలో నాలుగు నెలల్లలోనే 50 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ నిర్వహించడం గర్వించదగ్గది. సీఎం కేసీఆర్ ఆశయాల మేరకు నిరుపేదల కోసం నిరంతరం కృషిచేస్తున్న నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రాహుల్దేవరాజ్తోపాటు ఇతర సిబ్బందికి అభినందనలు. నిరుపేదలకు అందని ద్రాక్షగా ఉన్న ఖరీదైన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను సీఎం కేసీఆర్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇది ఎంతోమంది నిరుపేదలకు వరంగా మారి పునర్జన్మ ప్రసాదిస్తున్నది. – ట్విట్టర్లో మంత్రి హరీశ్రావు
తెలంగాణ ప్రభుత్వ సహకారంతోనే నిమ్స్లో ఇంత పెద్ద సంఖ్యలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చేయగలుగుతున్నాం. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు నిరుపేదల వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో నిరుపేదలకు కిడ్నీ, లివర్ వంటి ఖరీదైన ట్రాన్స్ప్లాంట్స్ సేవలు ఉచితంగా అందుతున్నాయి.
– డాక్టర్ రాహుల్ దేవరాజ్, యూరాలజీ విభాగాధిపతి, నిమ్స్