Sea Food | సముద్ర ఆహారాలు (సీ ఫుడ్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చాలా మంది భావిస్తారు. చేపలు, రొయ్యలు, పీతలు, ఆయిస్టర్లు వంటి సముద్ర ఆహారాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, డీహెచ్ఏ, అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి గుండె, మెదడు ఆరోగ్యానికి మేలు చేయడంలో సహాయపడతాయి. అయితే వీటిని తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. సముద్ర ఆహారాలు పోషకవిలువలతో నిండి ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో హానికరమైన లోహాలు, కాలుష్య కారకాలు కూడా వీటిలో చేరే అవకాశం ఉంటుంది. సముద్రాలు, నదులు పారిశ్రామిక వ్యర్థాలు, రసాయన కాలుష్యానికి గురికావడం వల్ల చేపలు, ఇతర సముద్ర జీవుల్లో కొన్ని విషపదార్థాలు పేరుకుపోతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్స్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కొన్ని రకాల సముద్ర ఆహారాల్లో మిథైల్ మెర్క్యురీతోపాటు పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ వంటి కాలుష్య కారకాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇవి అధిక మోతాదులో శరీరంలో చేరితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. మిథైల్ మెర్క్యురీతోపాటు సీసం (లెడ్), మాంగనీస్, క్రోమియం, క్యాడ్మియం, ఆర్సెనిక్ వంటి లోహాల ఆనవాళ్లు కూడా కొన్ని సముద్ర ఆహారాల్లో కనిపిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇవి ఎక్కువ కాలం శరీరంలో పేరుకుపోతే ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. కొన్ని పరిశోధనల ప్రకారం అధిక స్థాయిలో మెర్క్యురీకి గురికావడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో శరీర రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన కణాలపైనే దాడి చేయడం ప్రారంభిస్తుంది. దీని వల్ల ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్, లూపస్, షోగ్రెన్ సిండ్రోమ్, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
పారిశ్రామిక కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే మెర్క్యురీ నీటిలో కలిసిపోవడంతో చేపలు, షెల్ఫిష్లో అది పేరుకుపోయే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చేపలు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అనేక అధ్యయనాలు సూచించినప్పటికీ, అధిక స్థాయిలో కాలుష్య కారకాలు ఉన్న చేపలను తరచూ తీసుకుంటే ఆ ప్రయోజనాలు తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పిల్లలు సముద్ర ఆహారం తీసుకునే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అధిక మెర్క్యురీ ఉన్న చేపలను తరచూ తీసుకోవడం వల్ల గర్భంలోని శిశువు నాడీ వ్యవస్థ అభివృద్ధిపై ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఇది భవిష్యత్తులో జ్ఞాపకశక్తి, భాషా నైపుణ్యాలు, దృష్టి-కదలికల సమన్వయం వంటి అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని వెల్లడించాయి. అయితే దీనర్థం సముద్ర ఆహారాలను పూర్తిగా మానేయాలని కాదు. నమ్మకమైన ప్రాంతాల నుంచి లభించే, నాణ్యమైన సముద్ర ఆహారాన్ని పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిది. ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులు తమ ఆహారంలో చేపలను చేర్చే ముందు వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.