హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ): నిమ్స్ దవాఖానలో ఇద్దరు నర్సుల పంతం.. రోగులకు ప్రాణ సంకటంగా మారింది. సెలవులపై స్పష్టత లేకపోవడంతో ఒకరిద్దరికీ మెమోలు ఇవ్వడం నర్సుల మెరుపు ధర్నాకు కారణమైంది. ఇద్దరి సమస్యను అందరికీ ఆపాదించడం, ముందస్తు సమాచారం ఇవ్వకుండా మూకుమ్మడిగా నర్సులు విధులను బహిష్కరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధర్నాతో వైద్యసేవలు సైతం నిలిచిపోయాయి. రోగుల ప్రాణాలను పణంగా పెట్టి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ధర్నాకు దిగడం ఎంతవరకు సమంజసమని ఉన్నత వర్గాలు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకు ధర్నా చేస్తున్నారో? నిరసనలో కూర్చున్న చాలామందికి సైతం తెలియదని వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగిందంటే..
సెలవులపై ఇటీవల ముగ్గురికి మెమోలు జారీ అయ్యాయి. మెమో అందుకున్న వారిలో స్టాఫ్ నర్స్ విజయకుమారి ఒకరు. 143 రోజులపాటు ఆమె రిజిస్టర్లో సంతకాలు చేయలేదు. నర్సింగ్ సూపరింటెండెంట్గా పని చేస్తున్న లలితకుమారి 17 రోజులు సాధారణ సెలవులు తీసుకున్నారు. కానీ, ఆమె ఆన్లైన్ లీవ్ సిస్టమ్ ద్వారా దరఖాస్తు చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే నిమ్స్ డైరెక్టర్ బీరప్ప వారికి మెమోలు జారీచేశారు. ఇదేవారికి కోపం తెప్పించింది. వీరికి మద్దతుగా మిగతా నర్సులు మూకుమ్మడిగా ధర్నాకు దిగారు. సోమవారం రాత్రి మొదలైన ఆందోళన మంగళవారం రాత్రి వరకు కొనసాగింది.
ధర్నాతో నిలిచిన శస్త్రచికిత్సలు
నర్సుల ఆందోళనతో ఎలెక్టివ్ సర్జరీలు నిలిచిపోయాయి. ఒక్క ఆర్థోపెడిక్ విభాగంలోనే పది కీళ్లమార్పిడి శస్త్రచికిత్సలు నిలిచిపోయి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎమర్జెన్సీ సర్జరీలకు సైతం ఆటంకం కలిగింది. తిండీతిప్పలు లేకుం డా పిల్లల ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు అవస్థ పడ్డారు. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసి చర్చలకు పిలవగా.. నర్సింగ్ సిబ్బంది నిరాకరించారు. మెమోలను తక్షణమే వెనక్కి తీసుకుంటేనే చర్చలకు సిద్ధమని తేల్చిచెప్పారు. ఇతర డిమాండ్లను తెరపైకి తెస్తున్నప్పటికీ.. చేసిన తప్పులను పక్కదోవ పట్టించేందుకే కొంతమంది పనిగట్టుకుని మిగతా నర్సులందరినీ ధర్నాకు ఉసిగొల్పుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా నర్సింగ్ సిబ్బంది నిరసన తెలియజేయడం వల్ల ఎమర్జెన్సీ చికిత్సలు అవసరమైన రోగుల పరిస్థితి ఏంటని? పలువురు ప్రశ్నిస్తున్నారు. విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించిన ప్రతి సందర్భంలోనూ సిబ్బంది ఆందోళనలకు దిగడం పరిపాటిగా మారిందన్న చర్చ సైతం స్థానికంగా జరుగుతున్నది.
కూలీ పనులు చేసుకుంటా..
మాది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నా. నిరుడు నా ఎడమ మోకాళ్లు అరిగిపోయాయని, సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు. వారం పది రోజులవుతుంది. నిమ్స్ ఆర్థో వార్డులో చికిత్స తీసుకొంటున్నా. మంగళవారం కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయాల్సి ఉంది. నర్సులు ధర్నా చేశారని, ఇవ్వాళ ఆపరేషన్ చేయడం లేదని డాక్టర్లు చెప్పారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినం. కూలీ పనులు చేసుకొనే మేము.. ఇన్ని రోజులు దవాఖానలో ఉండటం వల్ల కుటుంబ పోషణ ఇబ్బంది అవుతుంది. మాలాంటి వారి పరిస్థితి నర్సులు అర్థం చేసుకోవాలి. -ఎం కృష్ణయ్య, కల్లూరు, ఖమ్మం
అమ్మో.. బాధ భరించలేకపోతున్నా..
నేను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డిపోలో ఆర్టీసీ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నా. రోడ్డు ప్రమాదంలో నా కుడి కాలు విరిగింది. ఆపరేషన్ చేయాలని అక్కడి డాక్టర్లు చెప్పారు. దీంతో నా భార్యాపిల్లలతో కలిసి నిమ్స్కు వచ్చిన. భరించలేని నొప్పి వస్తుంది. మంగళవారం ఆపరేషన్ చేయాల్సి ఉంది. నర్సుల ధర్నా కారణంగా సిబ్బంది లేక చేయలేమని వైద్యులు చెప్పారు. ఈ నొప్పి భరించలేకపోతున్నా. ఆపరేషన్ అయితే నాకు నొప్పి తగ్గేది. ఉగాది పండుగ కావడంతో మళ్లీ శుక్రవారం వరకు వాయిదా పడింది. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి.
–కే మధు, ఆర్టీసీ డ్రైవర్, నిజామాబాద్
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చా..
మాది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా. నిమ్స్ దవాఖానపై ఎంతో నమ్మకం ఉన్నది. ఇక్కడ అధునిక వైద్య చికిత్సలు అందిస్తున్నారు. నెఫ్రాలజీ విభాగంలో చికిత్స తీసుకునేందుకు వచ్చా. నర్సుల ఆందోళనల వల్ల వైద్యులు అందుబాటులో లేకుండాపోయారు. కుటుంబ సభ్యులతో వచ్చి చాలా ఇబ్బందులు పడ్డా. చికిత్స అందేసరికి రాత్రి 8 గంటలు దాటింది. ధర్నా చేసే ముందు మాలాంటి రోగుల దయనీయ స్థితి వారు గుర్తు చేసుకోవాలి. –లెనిన్ సామ్యూల్ రాజ్, కర్నూలు
సర్వీసులో తప్పులు చేస్తే మెమోలు ఇవ్వొద్దా?
విధుల్లో ఉండి ఎవరైనా తప్పు చేస్తే వారికి శాఖాపరంగా మెమోలు ఇవ్వడం సహజం. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఉద్దేశంతోనే నా వంతు బాధ్యతగా ఆ స్టాఫ్నర్సులకు మెమోలు ఇచ్చాను. దీంతో అందరికీ అన్యాయం జరిగినట్టు ఆపాదించి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ధర్నాలు చేపట్టి రోగులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. వారు చేసిన నిరసన వల్ల ఆపరేషన్ థియేటర్లలో సర్జరీలు నిలిచిపోయాయి. రోగులు ఎంతో ఇబ్బందులు పడ్డారు.
–డాక్టర్ బీరప్ప, డైరెక్టర్ నిమ్స్