NIMS | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): అత్యంత క్లిష్టమైన ‘స్పైన్ స్కోలియోటిక్’ శస్త్రచికిత్సల నిర్వహణలో నిమ్స్ దవాఖాన దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎన్నో ఏండ్ల నుంచి ఈ శస్త్రచికిత్సలను కొనసాగిస్తూ గూని రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నది. వాస్తవానికి గతంలో చాలా తక్కువ మంది ఈ శస్త్రచికిత్సల కోసం నిమ్స్ను ఆశ్రయించేవారు. కానీ, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తేవడం, సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేయడంతో ప్రస్తుతం నెలలో ఏడెనిమిది శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్టు నిమ్స్ ఆర్థోపెడిక్ వైద్యనిపుణులు డాక్టర్ నగేశ్, డాక్టర్ రాజు అయ్యంగార్ వెల్లడించారు.
గతంలో ఈ శస్త్రచికిత్సకు 15-16 గంటల సమయం పట్టేదని, ప్రస్తుతం నూతన వైద్య విధానాలు, ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో ఒక్కో శస్త్రచికిత్స 8 గంటల్లోనే పూర్తవుతున్నదని వివరించారు. కార్పొరేట్ దవాఖానల్లో రూ.15-20 లక్షల వరకు ఖర్చయ్యే ఈ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ కింద కేవలం రూ.1-1.5 లక్షలకే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 98 శాతం మేరకు స్పైన్ స్కోలియోటిక్ శస్త్రచికిత్సలు నిమ్స్ దవాఖానలోనే జరుగుతున్నాయని, కార్పొరేట్ దవాఖానల్లో ఈ శస్త్రచికిత్సలు 2 శాతం మించడం లేదని పేర్కొన్నారు. నిమ్స్లో ఇప్పటివరకు వెయ్యికిపైగా స్పైన్ స్కోలియోటిక్ శస్త్రచికిత్సలు నిర్వహించినట్టు తెలిపారు.
సాధారణంగా గూని సమస్య చిన్నతనంలోనే తెలిసిపోతుంది. నిమ్స్లో 5 నుంచి 30 ఏండ్ల వయస్సు వారికి ఈ శస్త్రచికిత్సలు చేస్తున్నాం. రోగులకు ఎంత చిన్న వయస్సులో ఈ శస్త్రచికిత్స చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. గతంలో ఈ శస్త్రచికిత్సకు చాలా సమయం పట్టేది. ఇప్పుడు ఆధునిక ఇంప్లాంట్స్ అందుబాటులోకి రావడంతో తక్కువ సమయంలోనే శస్త్రచికిత్స చేయగలుగుతున్నాం. దీని వల్ల ఫలితాలు కూడా మెరుగ్గానే ఉంటున్నాయి. ఎంతో ఖరీదైన స్పైన్ స్కోలియోటిక్ శస్త్రచికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం అభినందనీయం.
– డాక్టర్ చెరుకూరి నగేశ్, ఆర్థోపెడిక్ వైద్యనిపుణుడు, నిమ్స్ దవాఖాన